ధర్మపురి, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. సోమవారం ధర్మపురి మండలం జైన సహకార సంఘం ఆధ్వర్యంలో జైనలో 58 లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనం, రాజారంలో 79 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాం, ఇదే గ్రామంలో 24 లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనం, మగ్గిడిఎడపల్లిలో 11.75 లక్షలతో నిర్మించిన గోదాంను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. జైనలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు మనబడి’ కింద 32 లక్షలతో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జైనలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు సరిగా లేదని, కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీదీ నియంత పాలన అని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే రోల్మోడల్గా నిలిచిందని కొనియాడారు. పదేళ్ల కిందట తెలంగాణ పల్లెలు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయో మన కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అలాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎంగా ఉండడం మన అదృష్టమన్నారు. బీజేపీ నీతిమాలిన రాజకీయాలను ప్రజలు గమనించాలని సూచించారు.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పింఛన్ కేవలం 600 ఇస్తున్నారని, కానీ, మన రాష్ట్రంలో దివ్యాంగులకు 3016, వృద్ధులు ఇతరులకు 2016 ఇస్తున్నామని చెప్పారు. ఒక్క జైనలోనే 1168 మందికి ప్రతి నెలా ఆసరా పింఛన్లు వస్తున్నాయన్నారు. మరో 1138 మంది రైతులకు రైతుబంధు కింద ఎకరానికి 10 వేల చొప్పున 7 కోట్ల 48 లక్షలు ఖాతాల్లో జమవుతున్నాయన్నారు. ప్రజలు గమనించి బీఆర్ఎస్కు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, సర్పంచులు కుడిక్యాల మహేశ్, ఎన్నం లక్ష్మారెడ్డి, కొండపెల్లి రామ్చందర్రావ్, పులిశెట్టి మల్లేశం, లహరిక, శ్రీనివాస్, ఎత్తిపోతల పథకం చైర్మన్ ప్రేమ్చందర్రావ్, సహకార సంఘం ఉపాధ్యక్షుడు మూల మోహన్రెడ్డి, డైరెక్టర్లు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంఈఓ బత్తుల భూమయ్య, ఆర్అండ్బీ డీఈ సౌమ్య, ఏఈ సతీశ్, ఎంపీవో నరేశ్, హెచ్ఎం అనూష తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య కోసమే మన ఊరు-మన బడి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకే ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం తెచ్చింది. తాగునీరు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, ప్రహరీ, వంటగది, పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, తరగతి గదుల మరమ్మతులు, అవసరమున్న చోట అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నం. మొదటి దశ పూర్తి కావొచ్చింది. అనంతరం రెండు, మూడో దశల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతం. తొమ్మిదేళ్లలో ధర్మపురి నియోజవర్గం ఎనలేని అభివృద్ధి సాధించింది. 150 కోట్లతో ప్రస్తుతం ధర్మపురి పట్టణ అభివృద్ధి జరుగుతున్నది.
– మంత్రి కొప్పుల ఈశ్వర్
రైతు సంక్షేమమే ధ్యేయం
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం. వ్యవసాయ రంగానికి అన్ని రకాలగా సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి ఈశ్వర్కు నా అభినందనలు. రోళ్లవాగును ఆధునీకీకరించి 35 వేల ఎకరాలకు, గోదావరి ఒడ్డున 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరందించడం గొప్ప విషయం. ఆయన ధర్మపురి ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంత వాసుల అదృష్టం. సీఎంఆర్ఎఫ్ ద్వారా 26 వేల కుటుంబాలకు 69 కోట్లు ఇప్పించి ఆదుకున్న ఘనత మంత్రి కొప్పులదే. మంత్రి ప్రత్యేక చొరవ చూపి వెల్గటూర్ మండలంలో స్థాపించాలనుకున్న ఇథనాల్ పరిశ్రమను ప్రతిపక్షాలు అడ్డుకోవడం విడ్డూరం. ఈ పరిశ్రమ నెలకొల్పడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది.