కార్పొరేషన్, మే 7: కరీం‘నగరాన్ని’ రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నూతనంగా అభివృద్ధి చేసిన ఐలాండ్ను ఆదివారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కరీంనగర్ను రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన వందల కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే ప్రతి రహదారిని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.
గతంలో ఎప్పుడూ నగరపాలక సంస్థకు ఈ స్థాయిలో నిధులు రాలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే నిధుల వరద పారుతున్నదని చెప్పారు. రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి చౌరస్తాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐలాండ్స్ను ఏర్పాటు చేశామన్నారు. నగరంలో 13 చౌరస్తాలను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే తెలంగాణ చౌక్, బొమ్మకల్ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా పనులు ప్రారంభమైనట్లు వివరించారు. పద్మనగర్, కోతిరాంపూర్, తదితర చౌరస్తాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. నగరంలో కేబుల్ బ్రిడ్జి పనులు తుది దశకు వచ్చాయని, అతి త్వరలోనే దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో మొదటి దశను ఆగస్టులో ప్రారంభించి, నగరానికి పర్యాటక శోభ తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు వాల రమణారావు, బోనాల శ్రీకాంత్, మహేశ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.