తిమ్మాపూర్/మానకొండూర్, ఏప్రిల్ 25: తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్లోని సుప్రీమ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మినీ ప్లీనరీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, ప్రసంగించారు. అంతకు ముందు బీఆర్ఎస్ జెండా గద్దె నుంచి నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన ఐదు వేల మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన బీఆర్ఎస్ను స్థాపించి 22 ఏండ్లు అయిందని, నాటి ఉద్యమ నాయకుడు, నేటి సీఎం కేసీఆర్ 14 ఏండ్లు ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్ర ఆకాంక్ష గళాన్ని ఎత్తుకుని లక్ష్యం సాధించారని చెప్పారు. ప్రపంచం, దేశంలో ఎన్నో పార్టీలు ఎన్నో ఉద్యమాల నుంచి పురుడు పోసుకున్నాయి కానీ, ఒక్క బీఆర్ఎస్ మాత్రమే తన ఆకాంక్షను నెరవేర్చుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నదని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందని, ఆనాటి పల్లెలు ఎలా ఉండేవో, నేడు ఎలా ఉన్నాయో వివరించారు. అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఇలాంటి పార్టీలో ఆవిర్భావం నుంచి నేటి దాకా కొనసాగే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలకు అవకాశం ఉందని, మరోసారి విజయఢంకా మోగించాలన్నారు. తెలంగాణ వచ్చాక బీసీ నాయకులను, బీసీ స్వాతంత్య్ర సమరయోధులకు ఎంతో విలువ ఇచ్చామని, ట్యాంకు బండ్లపై వారి విగ్రహాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించారని, అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కానీ, బీసీనని చెప్పుకుంటున్న ఎంపీ బండి సంజయ్ వారి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లీనరీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ తీర్మానాలు
రైతాంగ వ్యవస్థ, సంక్షేమం, పథకాలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ తీర్మానించగా, సభ్యులు ఆమోదించారు.
సమస్యల్లేని రాష్ట్రం తెలంగాణ
నాడు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ, నేడు ఏ సమస్యాలేని రాష్ట్రంగా ఫరిడవిల్లుతున్నది. ముఖ్యంగా రైతాంగ సమస్యలు గతంలో ఎవరి పాలనలోనూ పరిష్కారం కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ఏర్పాటు చేసి ఎన్నో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం చూపింది. భూములను దోచుకున్న చరిత్ర ఉన్నవారే ధరణిని వ్యతిరేకిస్తున్నారు. ధరణి అంటే ఏంటో తెలియని వారే దాని గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. రైతాంగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును మహాయజ్ఞం లాగా నిర్మించి ప్రభుత్వం గ్రామ గ్రామానికి సాగు నీటిని అందిస్తున్నది.
ఫలితంగా తెలంగాణ నేడు సస్యశ్యామలమవుతోంది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చూసుకున్నది. పెట్టుబడికి రూ.10 వేల రైతుబంధు, రైతు అనుకోకుండా ఎలా మరణించినా కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేస్తున్నది. ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు. వీటిని ప్రజలు గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ర్టాలకు రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేస్తుంటే ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు. బండి సంజయ్కు ఏమీ తెలియదు. సీఎంను జైలుకు పంపుతా.. పంపుతా అని రెండు సార్లు జైలుకెళ్లారు.మరో నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆయనకు పని లేనప్పుడే నియోజకవర్గానికి వచ్చి తిరిగి వెళ్తాడు. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎక్కడెకక్కడి వారో వచ్చి ప్రజలు, ఓటర్లను ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు. ఆగం కావద్దు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ ఉంటుందో వారినే నమ్మాలి. దొంగ మాటలు చెప్పేవారిని దూరం పెట్టాలి. ఎవరైనా వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తే వారు ఏం చేశారో ప్రశ్నించాలి.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు