గన్నేరువరం, అక్టోబర్ 29 : కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని.. ఆ పార్టీకి ఓటేస్తే ప్రజలు అంధకారంలో పడ్డట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. ఆదివారం గన్నేరువరం మండలకేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని, ప్రజలు టార్చ్లైట్లు కొనుక్కోవాల్సిందేనని సూచించారు.
రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతు ఆత్మహత్యలు ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఏడాదికి 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి మాట్లాడుతూ, అరవై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో అభివృద్ధి చేయలేదన్నారు. రైతు బంధు ఆపాలని చూసిన ఆ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు.
సీఎం కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలకు సాగు నీళ్లు అందుతున్నాయని, రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను వలస తీసుకువచ్చే స్థాయికి ఎదిగారని స్పష్టం చేశారు. అంతకు ముందు గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా బతుకమ్మలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలో కాంగ్రెస్ మహిళా మండలాధ్యక్షురాలు గొడుగు శ్రీలతతో పాటు 100 మంది బీఆర్ఎస్లో చేరగా వినోద్కుమార్, రసమయి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ లక్ష్మి, నాయకులు మోహన్రెడ్డి, మన్మోహన్రావు, సుధాకర్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.