తిమ్మాపూర్, నవంబర్ 22 : ఏ పనీ చేయనోడే ఎగిరెగిరి పడతున్నాడనీ, అట్లాంటోళ్లను నమ్మి ఆగం కావవద్దని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. బూతులు మాట్లాడే నాయకుడికి పోలింగ్ బూత్లోనే ఓటర్లు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. విజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులకు అసలే ఓటు వేయొద్దని కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్, మొగిలిపాలెం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ప్రసంగించారు. వ్యక్తిత్వం లేని నాయకులను దరికి రానీయొద్దన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు బూటు కాళ్లు దగ్గర కుక్కలాగా పడి ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణకు తనను విమర్శించే అర్హత లేదని హితవుపలికారు. గ్రామాలు కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉన్నాయో? తాను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని చూడాలని సూచించారు. తాము వేసిన రోడ్లపై నిలబడే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో కుల సంఘ భవనాలు అద్దాల్లా మెరుస్తున్నాయని, గ్రామ పంచాయతీ భవనాలు సచివాలయంలా కనిపిస్తున్నాయని చెప్పారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టని కొడుకుల స్థానంలో కేసీఆర్ పెద్ద కొడుకు అయ్యారని, ఎంతోమంది అవ్వల ఆశీర్వాదాలు తమపై ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోను వివరించారు. ఎమ్మెల్యే కాకముందే వాడు, వీడు అని సంభోదిస్తున్నాడని.. గెలిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గడపగడపకు అంటూ వస్తున్న కంచరపాలెం గ్యాంగ్ను నమ్మవద్దని సూచించారు. ఈ నెల 30న కారు గుర్తుపై ఓటు వేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు పూల వర్షం కురిపిస్తూ డప్పు చప్పుళ్లు కోలాటాల నృత్యాలు, బతుకమ్మలతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో నుస్తులాపూర్ సర్పంచ్, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కొత్త తిరుపతిరెడ్డి, పాశం అశోక్రెడ్డి, తిలక్, బేతి శ్రీనివాసరెడ్డి, వంతడుపుల సంపత్, వరుకోలు సమ్మయ్య పాల్గొన్నారు.