కార్పొరేషన్/ కలెక్టరేట్, జూలై 11: దక్షిణ భారతదేశంలోనే కరీంనగర్ను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. నగర శివారులో తలమానికమైన మానేరు రివర్ ఫ్రంట్ను నిర్మిస్తున్నామని, సెప్టెంబర్ మొదటి వారంలో రెండో విడుత పనులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఎంఆర్ఎఫ్ పనులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు జల, హరిత శోభను అద్దేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడమేగాకుండా హరితహారం లాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.
కాళేశ్వర జలాలతో కళకళలాడుతున్న మానేరుతీరంలో భవిష్యత్ తరాల ఆనందం కోసం మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణంపై తొలి ఉత్తర్వు జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ముందు సబర్మతీ రివర్ ఫ్రంట్ను పరిశీలించామని తెలిపారు. ఆ ప్రాజెక్టు కంటే గొప్పగా కరీంనగర్లో నిర్మిస్తున్నామని చెప్పారు. ఎంఆర్ఎఫ్లో ఏర్పాటు చేసే వివిధ ప్రాజెక్టులను, బిగ్ ఓ లాంటి వాటిని పరిశీలించేందుకు ఉత్తరకొరియా, సియోల్, యోసు లాంటి ప్రాంతాలను సందర్శించామని చెప్పారు. బిగ్ ఓ ఫౌంటెయిన్తోపాటు పలు పర్యాటక ప్రాంతాలను పరిశీలించామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. జిల్లాలో ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తూ చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసి భావితరాలకు ఆస్తిగా అందిస్తామని తెలిపారు.
మానేరు రివర్ ఫ్రంట్లో బుద్ధుడి విగ్రహం
మానేరు రివర్ ఫ్రంట్లో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని మా ట్లాడారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని, ఈ దిశగా దళితబంధు పథకాన్ని తెచ్చామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్వీ ర్ణన్ మాట్లాడుతూ ఈ యేడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు 37.28 లక్షల పరిహారం చెల్లించామని తెలిపారు. 58 అట్రాసిటీ కేసులు నమోదు కాగా, అందులో 10 తప్పుడు కేసులని, 13 చార్జ్షీట్, 35 విచారణలో ఉన్నాయన్నారు. అట్రాసిటీ కేసుల పరిహారం, ఇన్వెస్టిగేషన్ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమాల్లో నగర మేయర్ వై సునీల్రావు, సీపీ సుబ్బారాయుడు, ఏ డీసీపీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, డిప్యూటీ మేయర్ చల్లస్వరూపారాణీ హరిశంకర్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పీ నతానియేల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్, కమిటీ సభ్యులు మేడి మహేశ్, ఎలుక ఆంజనేయులు, కులదీప్వర్మ, తడగొండ నర్సింబాబు, లకవాత్ రవి పాల్గొన్నారు.