సర్కారు బడి నవ్వుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో కొంగొత్తగా మెరుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ దర్గా ప్రైమరీ స్కూలే నిదర్శనంగా నిలుస్తున్నది. నిన్నటి దాకా కనీస వసతుల్లేక శిథిలమైన బడి ఇప్పుడు సకల హంగులు అద్దుకొని తళుకులీనుతున్నది. 18.08లక్షలతో చుట్టూ ప్రహరీ.. తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులు.. డ్యూయల్ డెస్క్లు.. కరెంట్ కాంతులు.. బాలబాలికలకు వేర్వేరు టాయ్లెట్లు.. స్వచ్ఛమైన వాటర్ ట్యాంకులు, గోడలపై తీరొక్క రంగులతో కార్పొరేట్ స్కూల్ను తలపిస్తున్నది. మొన్నటిదాకా వెలవెలబోయిన ఈ స్కూల్ నేడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడుతున్నది.
– పెద్దపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 549 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 191పాఠశాలలు ‘మన ఊరు – మన బడి’ కింద ఎంపిక చేశారు. 38 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, ఇందులో 22 పాఠశాలలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇందులో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి. మొన్నటిదాకా శిథిలావస్థలో ఉన్న పాఠశాల ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తున్నది. ప్రభుత్వం మంజూరు చేసిన 18.08 లక్షలతో యంత్రాంగం అన్ని వసతులు కల్పించింది.
ఈ నిధులతో 12 రకాల పనులు చేపట్టింది. మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేసి, కిటికీలు, తలుపులను బిగించింది. పాఠశాల ఆవరణలో సెఫ్టిక్ ట్యాంక్ను నిర్మించి బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు, మరుగుదొడ్లను నిర్మించి వాటిల్లో టైల్స్ వేయించింది. కిచెన్ షెడ్లు నిర్మించింది. 4లక్షలతో తాగునీటి సౌకర్యం కల్పించింది. చుట్టూ కాంపౌండ్వాల్ నిర్మించడంతో పాటు గేటును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పాఠశాలలో విద్యుద్దీకరణ పూర్తిచేశారు. కొత్త ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను బిగించారు. తరగతి గదుల్లో డ్యూయల్ డెస్క్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఇంకా పాఠశాల ప్రాంగణంలోని మైదానంలో విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలాన్ని సిద్ధం చేశారు. ప్రత్యేకంగా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ఇలా సకల వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
సర్కారు విద్యకు విలువ పెరిగింది..
గత ప్రభుత్వాల హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సర్కారు పాఠశాలలకు ప్రభుత్వం ఆధునిక సొబగులు, అత్యాధునిక వసతులను కల్పించింది. ప్రభుత్వ పాఠశాలేనా అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతున్నది. విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచడంతో సర్కారు విద్యకు విలువ పెరిగింది. ఇప్పటికే ప్రైవేట్లో వేలకువేలు ఫీజులతో సతమతమయ్యే తల్లిదండ్రులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తున్నది. బయో మెట్రిక్తో మాపై సైతం ఆజమాయిషీ పెరిగింది. దీంతో మేమూ బాధ్యతగా పనిచేస్తున్నాం. గతం కంటే మాకు గొప్ప గౌరవం లభిస్తున్నది.
– కల్లెపు దవేందర్రెడ్డి, హెచ్ఎం, ఎంపీపీఎస్ రాఘవాపూర్ పెద్దపల్లి మండలం.
బడి రూపురేఖలు మారిపోయాయి..
ఈ స్కూల్లో నా కూతురు చదువుతున్నది. మా ఊరి బడి ఇట్లుండేది కాదు. పగిలిన గోడలు, దుమ్ముతో నిండిన తరగతి గదులు, పాకురు పట్టిన గోడలు, పగిలిన బండలు, విరిగిన కుర్చీలతో దర్శనమిచ్చేది. పిల్లలు తాగటానికి గుక్కెడు మంచినీళ్లు కూడా ఉండేవి కాదు. కానీ సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి కింద పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించి రూపురేఖలే మార్చివేశారు. ప్రైవేట్ స్కూల్ను తలదన్నేలా వసతులు ఉన్నాయి. మా పాప సంతోషంగా స్కూల్కు వెళ్తున్నది. నేనే కాదు తల్లిదండ్రులందరూ సంతోషపడుతున్నారు. ఫీజులు కట్టలేని మా లాంటి పేదలకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలిగించిన కేసీఆర్కు కృతజ్ఞతలు.
– చింతల సతీశ్, విద్యార్థిని తండ్రి, రాఘవాపూర్ పెద్దపల్లి మండలం.