Summer Sports Training Camp | రామగిరి, ఏప్రిల్ 28 : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికార ప్రతినిధి బీ సుదర్శనం సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆర్జీ-3 & ఏపీఏ ఏరియా ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను ఈ నెల 29వ తేదీ నుండి 25 రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.
సెంటినరీకానీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఫుట్బాల్, ఆర్చరీ (విలువిద్య), హాకీ వంటి క్రీడల్లో ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ శిబిరానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. 18 సంవత్సరాల లోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ శిక్షణలో పాల్గొనవచ్చని, ఆసక్తి గల వారు క్రీడల సమన్వయకర్త అంజయ్యను 9581318029 నంబర్కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.