మానకొండూర్ రూరల్, జనవరి 3: మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సు ఫ్రీ వారికి ఎంతో సంతోషాన్నిస్తుండగా, విద్యార్థులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. ఉదయం ఎలాగోలా కష్టపడి కాలేజీలు, పాఠశాలలకు వెళ్తున్న పిల్లలు, సాయంత్రం బస్సులు ఖాళీగా రాక తిరిగి ఇళ్లకు చేరలేకపోతున్నారు. బుధవారం మానకొండూర్ మండలం పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమీప గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి అభ్యసించే విద్యార్థులు దాదాపు 87 మంది పాఠశాల విడిచిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు 4 గంటలకు పోచంపల్లిలో రోడ్డుపైకి వచ్చారు. అయితే బస్సులు రాకపోవడం, వచ్చినా సీట్లు దొరక్కపోవడం, కనీసం నిల్చుని వెళ్లే జాగ కూడా లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నారు. ఒకరిద్దరు అతికష్టం మీద వెళ్లిపోయినా మిగతా విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు రాత్రి 8 గంటల దాకా పడిగాపులు పడ్డారు. దగ్గరుండి బస్సులను ఆపించి పిల్లలను పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, పిల్లల కోసం ప్రత్యేక బస్సులు వేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన ప్రియదర్శిని కోరారు.