Siricilla | కలెక్టరేట్, జూలై 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే మహాధర్నాకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ కోరారు. ఈ మేరకు ఆయన అమృతలాల్ శుక్లా కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఉద్యోగాల భర్తీలో విఫలమయ్యాయని విమర్శించారు. లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిరాశపరుస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న మహాధర్నాలో జిల్లా యువత, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు కోడం రమణ, సురం పద్మ, సిరిమల సత్యం, జిందం కమలాకర్, ఆడెపు రజిత, సందుపట్ల పోచమ్మ, రమేష్, లక్ష్మీరాజం, సదానందం తదితరులు పాల్గొన్నారు.