మల్లాపూర్, ఫిబ్రవరి 19: శ్రీ కనకసోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీ కనక సోమేశ్వరకొండ పైన గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులు భక్తి శ్రద్ధలతో జాగరణ చేసి శివరాత్రి మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు బల్యపల్లి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో రుద్రహోమం, తెప్పోత్సవం, అన్నపూజ తదితర ప్రత్యేక పూజలను చేశారు. అలాగే మెట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ నవీన్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్లు కాలినడకన కొండపైకి ఎక్కి ప్రత్యేక పూజలను నిర్వహించారు. రానున్న కొద్ది రోజుల్లో కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు, ఆలయాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు ఆకుతోట రాజేశ్, మర్రిపల్లి సత్తమ్మ, దేవాదాయ కమిటీ అధ్యక్షుడు సంగ గంగరాజం, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండి లింగస్వామిగౌడ్, కమిటీ సభ్యులు, శివదీక్షాపరులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.