జగిత్యాల, జూన్ 8 : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్కు తీరని లోటని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో అంచలంచెలుగా ఎదిగారని, ప్రజలకు ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోపినాథ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాగంటి మృతిపై దిగ్భ్రాంతి.. సుంకె రవిశంకర్
గంగాధర, జూన్ 8 : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతికి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోపీనాథ్ మరణం బీఆర్ఎస్కు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారని, శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు చేశారని గుర్తు చేశారు. గోపీనాథ్ హైదరాబాద్ మహానగరంలో నాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. గోపీనాథ్ను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.