Singareni | రామగిరి, మే 19 : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు. ఆర్జీ-3 పరిధిలోని ఎస్ఎంఎస్ ప్లాంట్ వద్ద కాంట్రాక్టు కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు తమ పని విధానాలు, రోజువారీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రతా పరికరాల లభ్యత, వేతనాల చెల్లింపు విధానం, వైద్య సదుపాయాలు, కార్మిక హక్కుల అమలు తదితర అంశాలపై వివరించారు.
ముఖ్యంగా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నప్పటికీ తగిన రక్షణ చర్యలు పూర్తిస్థాయిలో లేవని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హేమ వైష్ణవి మాట్లాడుతూ కార్మికుల జీవన పరిస్థితులు, ఉపాధి భద్రత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై సమగ్ర అధ్యయనం చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణి ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేసి సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ అశోక్, బీ శ్రీనివాస్తో పాటు రాజన్న, సంపత్, భూమయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.