కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 29 : లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి ఒక్క రూపాయి అదనంగా వ్యయం చేసినా, అభ్యర్థుల వేటు పడక తప్పదు. ఓడిపోయిన అభ్యర్థి అయితే, ఈసీ సూచన మేరకు పోటీకి దూరంగా ఉంచడం, గెలిచిన అభ్యర్థి అయితే అనర్హత వేటు వేయడం, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి అవకాశం కల్పించేలా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుంది. అభ్యర్థులు ప్రతి నిత్యం చేస్తున్న ఎన్నికల వ్యయాన్ని డేగ కండ్లతో పరిశీలిస్తుంది. అందుకోసం ప్రత్యేక బృందాలతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా కూడా నియమించింది.
ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. నామినేషన్ వేసే దాకా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టిన అభ్యర్థులు, అనంతరం రూపాయి వ్యయం చేయాలన్నా ఆలోచించాలి. ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరల ప్రకారమే ఖర్చులు చూపాల్సి రావడంతో అభ్యర్థులు చిన్న పొరపాటు కూడా జరుగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈసీ నిర్ణయించిన ధరలు మాత్రమే ఎన్నికల వ్యయ పుస్తకంలో పొందుపర్చాల్సి ఉండడంతో, ఎప్పటికప్పుడు అభ్యర్థులు అందజేసే ఖర్చుల వివరాలు, ఎన్నికల పరిశీలకులు సేకరించే వివరాలతో సరిపోయేలా చూసుకోవాలి.
ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల సంఘానికి నివేదికలు పంపితే, వేటు తప్పదని గ్రహించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 95 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. ఈ మొత్తం గత పార్లమెంటు ఎన్నికల్లో 70 లక్షలు మాత్రమే ఉండగా, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మరో 20 లక్షలు అదనంగా ఈసీఐ పెంచింది. ఈ మొత్తానికి అదనంగా వ్యయం చేస్తే గెలిచిన అభ్యర్థికైనా పదవీ గండం తప్పదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ వేసిన రోజు నుంచే ఖర్చు లెక్కిస్తుండగా, గతంలో మాదిరి ఈసారి ఒకరిద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా, మిగతా వారంతా సాదాసీదాగానే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థికయ్యే ఖర్చు వారి ఖాతాలోనే జమ కానుండగా, ప్రతి పైసా ఖర్చుకు విధిగా లెక్క చూపాలి. నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు తీసిన కొత్త బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఎన్నికల పరిశీలకులుగా జిల్లాకు ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులను ఈసీఐ కేటాయించింది. వీరు ఐదు రోజుల క్రితమే జిల్లాకు వచ్చి తమ విధులు నిర్వర్తిస్తుండగా, లోక్సభ పరిధిలో ఐదు సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అభ్యర్థులు చేస్తున్న వ్యయం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అంశాలు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నుంచి మొదలు ఓట్ల లెక్కింపు వరకు నియోజకవర్గాల పరిధిలో ఉంటూ, అభ్యర్థులు చేస్తున్న వ్యయాన్ని నిశితంగా చూడనున్నారు.