PMJ jewelry | ధర్మపురి, మే 19 : కరీంనగర్లోని పీఎంజే (PMJ) నగల దుకాణం దొంగతనం కేసు ధర్మపురిలో మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దొంగతనానికి పాల్పడ్డ నిందితులు ఈ నెల 1 నుండి 3న ఉదయం 6 గంటల వరకు ధర్మపురిలో బస చేసిన విజయలక్ష్మి లాడ్జ్ను ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా సీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే ఉంది. ఇంతకాలం ఈ లాడ్జ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తుంటే అధికారులకు కనిపించలేదా..? దొంగలు బస చేసిన తర్వాతే అక్రమాలు గుర్తొచ్చాయా..? ధర్మపురి వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతీ రోజు వందలాది మంది భక్తులు, యాత్రికులు బస చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో వసతి గృహాలు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా..? అతిథుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారా..? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా..? పోలీస్ వెరిఫికేషన్ జరుగుతోందా..? వంటి అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలి.
కానీ ఘటన జరిగిన తర్వాత మాత్రమే అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదలికలోకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక లాడ్జ్ను సీజ్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని పలువురు పేర్కొంటున్నారు. ధర్మపురిలో అనుమతులు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న ఇతర వసతి గృహాల పరిస్థితి ఏంటని పలవురు ప్రశ్నిస్తున్నారు. వాటిపై కూడా ఇదే స్థాయిలో తనిఖీలు జరుగుతాయా..? లేక ఈ చర్య ఒక సంఘటనకే పరిమితమై మళ్లీ పాత పద్ధతులకే పరిమితమవుతాయా అని ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. దొంగలు రెండు రోజుల పాటు బస చేసినా ఎవరూ అనుమానం వ్యక్తం చేయకపోవడం, వారి కదలికలపై సరైన నిఘా లేకపోవడం భద్రతా వ్యవస్థల వైఫల్యానికే సంకేతంగా కనిపిస్తోంది. ఒక సంఘటన తర్వాత తాత్కాలిక హడావిడి చేయడం కంటే, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమని ప్రజలు సూచిస్తున్నారు. ధర్మపురి ప్రతిష్ఠ, భక్తుల భద్రత దృష్ట్యా ఇప్పుడు అవసరమైంది ఒక్క లాడ్జ్పై చర్య కాదని, మొత్తం వ్యవస్థపై పారదర్శకమైన, కఠినమైన సమీక్ష నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.