‘గత అసెంబ్లీ ఫలితాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. అప్పుడు చేసిన తప్పిదాన్ని తిప్పికొడుదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తా చాటుదాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ను పక్కలో బల్లెంలా మారుద్దాం. వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. అందుకోసం మనమంతా సైనికుల్లా కష్టపడుదాం’ అని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఐదు సార్లు గెలిపించిన మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని, అన్నగా.. తమ్ముడిగా మీ తోడుంటాని ధైర్యమిచ్చారు. శనివారం వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలకేంద్రాల్లో వేర్వేరుగా నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12న కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో నిర్వహించే కదనభేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సిరిసిల్ల/వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట, మార్చి 9 : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆచరణకు సాధ్యం కాని హామీలతో మనం అధికారం కోల్పోయామని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. కేసీఆర్పై ఉన్న కోపాన్ని రేవంత్రెడ్డి రైతులపై చూపుతున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో కాంగ్రెస్ సర్కారు గ్యారంటీలను అమలు చేయకపోతే పార్టీకి బొంద తవ్వడం గ్యారంటీ అని స్పష్టం చేశారు.
శనివారం సాయంత్రం 4:40 గంటలకు వీర్నపల్లిలో, 6:20 గంటలకు ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. కాంగెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 420 హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ పాలనలో పంటలు ఎండుతున్నాయని, 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అకుంఠిత దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే కూడవెల్లి వాగు ద్వారా వచ్చిన గోదావరి జలాలతో ఎండకాలంలోనూ ఎగువమానేరు మత్తడి దూకిందని గుర్తుచేశారు.
మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను మాత్రమే ఎత్తిచూపుతున్నారని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమతో సాగునీటి సమస్య లేకుండా చేసేవారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే రైతుల ఆత్మహత్యలు చేసుకోక ముందే కుంగిన పిల్లర్లను మరమ్మతు చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సాగు, తాగునీటికి గోసలేకుండా చేశారని, రైతుబంధు సమయానికి వేసి రైతుల పక్షాన నిలిచారని గుర్తు చేశారు. గిరిజనులకు ఆరు నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని తిప్పికొట్టాలని, పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మానేటి నీటిలో పోరాట పటిమ ఉన్నదని, ఇది విప్లవాల గడ్డ ఎల్లారెడ్డిపేట అని కేటీఆర్ గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, కాలికి బలపం కట్టుకుని మిమ్మల్ని గెలిపిస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్ట పడాలని.. స్థానిక ఎన్నికల్లో మీ కోసం కష్టపడుతానని భరోసా కల్పించారు. ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, అందరికీ అందుబాటులో ఉంటానని ధైర్యమిచ్చారు.
ప్రతి గ్రామాన్ని తానే బాధ్యత తీసుకొని సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతానని చెప్పారు. బూతుల వారీగా, గ్రామాల వారీగా పకడ్బందీగా కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమష్టి కృషితో కేసీఆర్ బృందాన్ని పార్లమెంట్కు పంపే బాధ్యతను కార్యకర్తలంతా భుజాన వేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఖిల్లా అని, నాడు ఉద్యమ కాలంలో కేసీఆర్ను అక్కున చేర్చుకుని 2006 పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీ అందించిందని గుర్తు చేశారు.
వంద రోజుల్లో కాంగ్రెస్ సర్కారు గ్యారంటీలను అమలు చేయకపోతే పార్టీకి బొంద తవ్వడం గ్యారంటీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్పై ఉన్న కోపాన్ని రేవంత్రెడ్డి రైతులపై చూపుతున్నారని మండిపడ్డారు. తాను ఎల్లారెడ్డిపేటకు వస్తున్న దారిలో గుండారం వద్ద నీరు లేక పొలం నెర్రెలతో కనిపించిందని, ఇది కాంగ్రెస్ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. అలవికాని హామీలు ప్రకటించి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉహించని ఫలితాలు వచ్చాయన్నారు.
కరీంనగర్ మున్సిపాలిటీలో రోజూ తాగునీరు సరాఫరా అవుతుండేదని, రానున్న రోజుల్లో రెండు రోజులకు ఒకసారి సరాఫరా చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఇది కాంగ్రెస్ పాలనలో జరిగిన మార్పు అని అన్నారు. ఇటీవల ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లిలో రైతులు తన వద్దకు వచ్చి మానేరు నీటితో చెక్డ్యాంలు నింపాలని, అవి నిండితే తమకు దాదాపు 500 ఎకరాలకు సాగునీటికు ఢోకా ఉండదని చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉంటే తమకు ఈ కష్టం ఉండేది కాదని వారు పేర్కొన్నారని తెలిపారు.
ఒకప్పుడు వీర్నపల్లి ఎట్లుండెనని.. నేడు ఎట్లయిందని, నాడు ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక గ్రామంగా ఉండేదని, స్వరాష్ట్రంలో మండల కేంద్రంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వీర్నపల్లి మండలంలోని 10 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని చెప్పారు. పదేండ్ల పాలనలో వీర్నపల్లిలో 5 కోట్లతో పాఠశాల అభివృద్ధి అయిందని, రైతు వేదికతోపాటు పలు అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. కాంగ్రెస్ పాలనలో కష్టాలు ప్రారంభమయ్యాయని, వీర్నపల్లి మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు కోతలు మొదలయ్యాయని ఆవేదన చెందారు. గత వానకాలంలో రాష్ట్రంలో 14 శాతం అధిక వర్షపాతం నమోదైందని, అలాంటప్పుడు వేసవి రాకముందే కరువు చాయలు ఏర్పడడానికి కాంగ్రెస్ పాలనే కారణమని మండిపడ్డారు.
బండి సంజయ్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు సరిగా పోలేదు. ఎందుకంటే ఏం తెల్వనోళ్లు ఏమడుగుతరు? పొయ్యి ఏం అడుగుతనని పోవుడే బంజేసిండు. గతంలో ఎంపీగా వినోద్కుమార్ చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మోటర్లు కాలుతున్నయ్. నీళ్లకు తిప్పలయితంది. మళ్లీ పాత రోజులు వచ్చినయ్. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి పార్లమెంటులో గొంతును వినిపించే మంచి నాయకుడు వినోద్కుమార్ను గెలిపించుకోవాలె.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే రాష్ర్టాన్ని సాధించుకున్నం. ఆ మహానుభావుడు చూపిన బాటలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకున్నం. సంజయ్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు. పార్లమెంటులో కొట్లాడి నిధులు తెచ్చే నాయకుడు వినోద్కుమార్. పార్లమెంటులో అత్యధిక ప్రశ్నలడిగింది బోయినపల్లి వినోద్కుమార్ మాత్రమే. అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సమస్యలు తెలియని, వాటిని పరిష్కరించని, అభివృద్ధి పట్టని వ్యక్తి ఎంపీ అయ్యిండు. బండి సంజయ్ ఇప్పటి వరకు ఏం చేసిండో చెప్పడం లేదు. మళ్లీ అదే దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే ప్రయత్నం చేస్తున్నడు. బోయినపల్లి వినోదన్న మరోసారి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నడు. ఆయన పార్లమెంటుకు వెళ్లడం ప్రజల అవసరం. సిరిసిల్లకు విజన్ ఉన్న నాయకుడు ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని, ‘తెలంగాణ’ అన్న వారిపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరం. ఒక్కనాడు తెలంగాణ పదం ఉచ్చరించని తీరు చూసి బాధ అనిపించింది.
– తుల ఉమ, మాజీ జడ్పీ చైర్మన్