జ్యోతినగర్, ఆగస్టు 23: రామగుండం ఎన్టీపీసీలో లాఠీచార్జిపై సర్వత్రా ఆగ్ర హం వ్యక్తమవుతున్నది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది అమానుషంగా దాడి చేయడం పై ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం బ్లాక్డేగా ప్రకటించింది. లేబర్గేట్లో గేట్ మీటింగ్ నిర్వహించగా, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని, మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రత కల్పించాల్సిన సీఐఎస్ఎఫ్ బలగాలు కార్మికులపై లాఠీచార్జి చేయడం వెనుక యాజమాన్యం కుట్ర ఉందని తెలుస్తున్నదన్నారు. ప్రాజెక్టుకు ఏజీఎం హెచ్ఆర్గా విజయలక్ష్మి బాధ్యతలు తీసుకున్న ప్పటి నుంచి కార్మికులపై కక్ష్య సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాల అమలు చేయాల్సి వస్తుందని, ఎక్కడ కొత్త అగ్రిమెంట్పై పోరాటాలు చేస్తారోనని కార్మికుల్లో భయం పుట్టించేందుకే లాఠీచార్జికి కుట్ర చేశారని ఆరోపించారు.
ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఊరుకునే ప్రసక్తే లేదని, యాజమాన్యం మెడలు వంచైనా కార్మికులకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశానని, అలాగే మంత్రి కేటీఆర్కు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఇక్కడ డిప్యూ టీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, ఎన్వీ రమణారెడ్డి, ఎన్టీపీసీ జేఏసీ నా యకులు కౌశిక హరి, చిలుక శంకర్, సాంసాని శంకర్, ఇజ్జగిరి భూమయ్య, రాయమల్లు, నాగభూషణం, ఇతర పార్టీల నాయకులు మక్కాన్సింగ్, కుమారస్వామి, తోకల రమేశ్ ఉన్నారు.
హేయనీయం: ఎన్టీపీసీ జేఏసీ నేత కౌశికహరి
ఎన్టీపీసీ కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి హేయనీయమని, బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్టీపీసీ జేఏసీ నేత కౌశిక హరి డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీపీసీలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాఠీచార్జికి నిరసనగా జేఏసీ మూడు రోజులు ఎన్టీపీసీలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు తలపెట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల నాయకులు మద్దతు తెలుపాలన్నారు. బుధవారం ర్యాలీ, గురువారం రాస్తారోకో చేస్తామని చెప్పారు. ఇక్కడ జేఏసీ నాయకులు సీహెచ్ ఉపేందర్, చిలుక శంకర్, నాంసాని శంకర్, లక్ష్మారెడ్డి, సత్యం, రాయమల్లు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు ఐ కృష్ణ, వేల్పుల కుమారస్వామి ఉన్నారు.