Land survey | మల్లాపూర్, ఆగస్టు 31 : మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు భూముల సమస్యలపై ప్రత్యేకంగా సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామానికి సరిహద్దులు చూపాలని మండల, జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని, తమ గ్రామానికి చెందిన రైతులకు ఎలాంటి సమాచారంలో లేకుండా రెవెన్యూ అధికారులు ప్రస్తుతం తమ భూములను ఆనుకోని ఉన్న సంగెం-శ్రీరాంపూర్లో భూ సర్వేను చేస్తున్నారని, ఈ సర్వేను అధికారులు ఇష్టానుసారంగా చేయడం సరికాదన్నారు.
ఇప్పటికైన సంబధిత ఉన్నత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని, లేని పక్షంలో గ్రామస్తులందరూ కలెక్టరేట్కు వెళ్లి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తోట రాజరెడ్డి, ఆకుల భీమయ్య, కోటగిరి రాజాగౌడ్, పందెన రవి, రేండ్ల భూమారాజం, పందెన శేఖర్, సుతారి భూమేష్, దొంతుల రాజు కుమార్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.