రెండో రోజూ నిరసనలతో హోరెత్తించిన కార్మిక, కర్షక సంఘాలు
ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు
ఉద్యోగుల సంఘీభావం.. నల్లబ్యాడ్జీలతో విధులకు
కార్యాలయాల ఎదుట నిరసనలు
తెరుచుకోని బ్యాంకులు, అందని పోస్టల్ సేవలు
సింగరేణి వెలవెల.. స్తంభించిన బొగ్గు ఉత్పత్తి
కార్మికలోకం కదం తొక్కింది. బీజేపీ సర్కారుపై భగ్గుమన్నది. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా చేపట్టిన రెండ్రోజుల సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. తొలిరోజులాగే మంగళవారం రెండో రోజూ కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేశాయి. ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. అటు సింగరేణి ప్రాంతం ఆందోళనతో అట్టుడికింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే గద్దె దించుతామని కేంద్రాన్ని హెచ్చరించారు.
కరీంనగర్, మార్చి 29 : దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా జిల్లాలో కొనసాగింది. బ్యాంకులు, పోస్టల్, ఎల్ఐసీ సేవలు స్తంభించి పోయాయి. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిన్నటిలాగే ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్మిక విభాగంతోపాటు వామపక్ష సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ తదితర ట్రేడ్ యూనియన్లు, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తదితర యువజన, విద్యార్థి సంఘాలు ఈ రోజు జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ సమ్మెకు సంఘీభావం తెలిపింది. ఎల్ఐసీ, పోస్టల్ ఉద్యోగులు ఆయా కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆయా బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నాలుగు రోజులుగా బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహించక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆందోళనలతో అట్టుడికిన జిల్లా..
జిల్లాలోని అల్గునూర్లో టీఆర్ఎస్ కేవీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ మానవ హారం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు నగరంలోని మంకమ్మతోటగల జౌళీ శాఖ కార్యాలయం ముందు పవర్ లూం కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానాలోని దాదాపు 250 మంది సిబ్బంది ధర్నా చేశారు. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో కూడా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. అల్గునూర్లో మానవహారం కారణంగా ఇటు కరీంగనగర్, అటు హైదరాబాద్, వరంగల్ రహదారులపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామైంది. పోలీసులు ఆందోళన కారులను చదరగొట్టి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వామపక్ష పార్టీల నాయకులు పొనగంటి కేదారి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఎడ్ల రమేశ్ యూ శ్రీనివాస్ పాల్గొన్నారు.