మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం ఊరూరా సమైక్యతా సంబురం అంబరాన్నంటింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వేడుకలు కనులపండువలా సాగాయి. ఉదయాన్నే గ్రామగ్రామాన త్రివర్ణ పతాకాలు ఎగిరాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సంబురాలు హోరెత్తాయి. మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఆకట్టుకున్నది. తెలంగాణ సాయుధ పోరాటయోధుల కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమంతో మైదానమంతా దేశభక్తి వెల్లివిరిసింది. ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్
ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించింది. దశాబ్ద కాలంగా సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తున్నది. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. అన్ని రంగాల్లో విశేష ప్రగతి సాధిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. ఇలాంటి తరుణంలో తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణంగా ఉన్నది. భవిష్యత్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి మరింత గొప్పగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమున్నది.
– జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్
76 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ అరవై ఏండ్లుగా అస్థిత్వం కోసం పోరాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో అప్రతిహాతంగా దూసుకెళ్తూ దేశానికే దిక్సూచిగా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, 24 గంటల ఫ్రీ కరెంట్, రైతుబంధు లాంటి పథకాలతో సాగు సుసంపన్నమైంది. వైద్యవిద్యలో నంబర్వన్గా నిలిచింది. సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం బతుకమ్మ చీరెలు, రంజాన్, క్రిస్మస్ దుస్తుల ఆర్డర్లు ఇచ్చి ఇక్కడి నేత కార్మికులకు చేతినిండా పనికల్పించింది. త్రిఫ్ట్, చేనేతబీమా లాంటి పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు నింపింది.
– సిరిసిల్లలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల స్వపరిపాలనలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించింది. అభివృద్ధి, సంక్షేమం, ఐక్యతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంసృతుల మధ్య సమైక్యత. సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక తెలంగాణను సాధించాం. ప్రజల మధ్య ఐక్యతతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దాం. మరింత ముందుకు తీసుకెళ్దాం. ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల పాటు ఇబ్బంది పడ్డ విద్యుత్, తాగునీటి సమస్యకు శాశ్వత పరిషారం చూపాం. అన్నివర్గాల ముఖాల్లో సంతోషాన్ని నింపాం.
– పెద్దపల్లిలో మండలి చీఫ్ విప్ భానుప్రసాద్రావు
కరీంనగర్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్ : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించగా, ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, కలెక్టర్ బీ గోపి, సీపీ ఎల్ సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్ రావు పాల్గొనగా, ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు మైమరపించాయి.
అలాగే పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది, పలు అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలీసులు, ఫైరింగ్ సిబ్బంది సహా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇచ్చిన అగ్నిప్రమాదాల నివారణ, బాంబు డిస్పోజల్ మాక్ డ్రిల్, అలాగే డెంగ్యూ వ్యాధిని అరికట్టడం, ఓటు హక్కు వినియోగం, బాల్య వివాహాల నిర్మూలనపై చేసిన ప్రదర్శనలు కట్టిపడేశాయి. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధుల కుటుంబ సభ్యులను మంత్రి గంగుల ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై మంత్రి వివరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరేశారు.