వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్ ఇప్పుడు జనంలో లేడని, ఓడిన బీఆర్ఎస్ నాయకులే సమస్యలు పరిష్కరిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ జిల్లాలో మరో ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి పర్యటించారు. ముందుగా కరీంనగర్లో నిర్మించిన ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్(కేసీఆర్)హౌస్ను ప్రారంభించి, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై అభివృద్ధి పనులు, దళితబంధు అమలుపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జమ్మికుంటలోని భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ఈసారి జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిచేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన, జమ్మికుంట నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ మళ్లీ తిరిగి ఇటు చూడలేదని, ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, అతనికి అండగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే జనంలో ఉన్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. గత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, అందులో ఏమైనా చేశాడా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో నిధుల వరద పారిస్తామని అన్నారని, అక్కడో ఇంజిన్, ఇక్కడో ఇంజిన్ డబుల్ ఇంజిన్తో హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈటల గడిచిన 14 నెలల్లో దమ్మిడిపైసానైనా తెచ్చి అభివృద్ధి చేశారా? అని నిలదీశారు. రూ.3 వేల పింఛన్ ఇప్పిస్తానని చెప్పిన ఈటల రాజేందర్ మాటలు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్లు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ గడ్డ మీద మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసం ఈ బహిరంగ సభను చూసిన తర్వాత తెలిసి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు.
ఈటల వ్యాఖ్యలు బాధాకరం
ఈటల రాజేందర్ నెల రోజుల కింద మాట్లాడిన మాటలు తనకు చాలా బాధనిపించాయని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో రాష్ర్టానికి అరిష్టం పట్టుకున్నదని అన్నారని, ఈ విషయంలో ఒక్కసారి హుజూరాబాద్ ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారన్న విషయం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసిన తండ్రి లాంటి కేసీఆర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. 2004లో టీఆర్ఎస్ టికెట్ కోసం 33 మంది పోటీ పడినా ఈటలను ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి పంపించారని, కానీ ఈరోజు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు కేసీఆర్ పాలన రాష్ర్టానికి అరిష్టంగా ఉందని అన్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా విబేధాలు ఉండవచ్చు, కానీ రాజకీయంగా జన్మనిచ్చిన తండ్రి లాంటి వ్యక్తిని ఈ విధంగా అనడం రాజేందర్కు తగునా? అని ప్రశ్నించారు. ఎవరి పాలన అరిష్టంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు.
ఎవరి పాలన అరిష్టం?
ఎవరి పాలన అరిష్టమో ఈటల రాజేందర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు జమ చేసిన కేసీఆర్ పాలన అరిష్టమా?, ఢిల్లీలో ఆందోళన చేసిన 700 మంది రైతుల ఉసురు తీసిన ప్రధాని మోదీ పాలన అరిష్టమా?, రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1,200కు పెంచిన మోదీ పాలన అరిష్టమా?, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలను ఆడ బిడ్డల కోసం అమలు చేస్తున్న కేసీఆర్ పాలన అరిష్టమా?, జిల్లాకొక మెడికల్ కళాశాల కట్టిస్తున్న కేసీఆర్ పాలన అరిష్టమా?, రాష్ర్టానికి ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయని మోదీ పాలన అరిష్టమా?, దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న గుజరాత్లో రూ. 700 మాత్రమే పింఛన్ ఇస్తున్న బీజేపీ పాలన అరిష్టమా, రూ.2,016 పింఛన్ అందిస్తున్న తెలంగాణలోని బీఆర్ఎస్ పాలన అరిష్టమా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
సానుభూతి మాటలకు మోసపోవద్దు
వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ మళ్లీ సానుభూతి వచనాలతో జనం ముందుకు వస్తారని, ఆయన మా టలు నమ్మితే మోసపోతారని మంత్రి కేటీఆర్ సూ చించారు. “చంపుకున్నా మీరే.. సాదుకున్నా మీరే” అంటూ చిలుక పలుకులు పలుకుతాడని, ఆయన మాటలు వింటే గందరగోళం, ఆగమాగం అవుతామని జాగ్రత్త చెప్పారు. మొన్నటి ఉప ఎన్నికల్లో జరిగిన పొరపాటును మళ్లీ జరగనీయవద్దని, కసితో, కమిట్మెంట్తో పనిచేసి హుజూరాబాద్ గడ్డపై భవిష్యత్తులో గులాబీ జెండాను ఎగురవేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నాలుగున్నరేండ్లలో ఎంపీగా బండి సంజయ్, 14నెలలుగా ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఒక్క నయా పైసా కూడా తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఎన్నో చెప్పిన ఈ ఇద్దరు ఆ తర్వాత మా త్రం ఎమ్మెమ్మే.. బెబ్బెబ్బే.. అంటున్నారని ఎద్దేవా చేశారు. జమ్మికుంటలో జరిగిన ఈ సభను చూస్తే వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమనిపిస్తున్నదని మంత్రి కేటీఆర్ ధీ మా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్,వొడితల సతీశ్కుమార్,సుంకె రవి శంకర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎస్సీ కార్పొరేషన్చైర్మన్ బండ శ్రీనివాస్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిప ల్ చైర్పర్సన్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, గందె రాధిక, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండలలాధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.
దేశ రాజకీయాలను మార్చేందుకే బీఆర్ఎస్
బీజేపీ కేంద్రంలోకి వచ్చి తొమ్మిన్నరేైళ్లెంది. దేశంలో కాంగ్రెస్ ఏన్నో ఏళ్లు పాలించింది. వాటి పాలన చూసిన్రు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన చూస్తున్నరు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడింది. ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమించినం. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించినం. చెప్పినవి చేస్తున్నం. చెప్పనివీ చేస్తున్నం. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు అమలు చేస్తున్నరు. ఇక్కడి పథకాలను మోదీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నరు. కానీ, మోదీ విఫలమైండు. దేశాన్ని అవినీతిమయంగా చేస్తున్నడు. మోదీ నాకెవరు లేరని చెప్పి ప్రజలను వంచిస్తున్నడు. కానీ, ఆయనకు చాలా పెద్ద కుటుంబం ఉంది. వాళ్లెవరో తెలుసా..? ఆదానీ, అంబానీ. మనం బ్యాంకుల్లో పెట్టుకున్నవన్నీ దోపిడీ చేసి వాళ్లకు అప్పనంగా పెడ్తున్నడు. పెట్టుబడిదారులు, దేశాన్ని దోపిడీ చేసేటోళ్లకు పంచుతున్నడు. బండి సంజయ్ నీవు మా నాయకుడు సీఎం కేసీఆర్ను జైళ్లో పెడ్తానన్నావ్ కదా.. ఇయ్యాల మోదీ చేసిన పనికి ఏం చేస్తావ్? అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టు. విచారణ చేద్దాం. దోపిడీని బయటకు తీద్దాం. దేశంలో ఇంత పెద్ద అవినీతి జరిగింది కదా.. దాదాపు 12లక్షల కోట్లు దోపిడీదార్లకు కట్టబెట్టింది నిజం కాదా..? మా రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటే విపరీతమైన వడ్డీ వేస్తున్నరు. మా ఆస్తులు జప్తు చేస్తున్నరు కదా.. నువ్వెందుకు వీటన్నింటి మీద మాట్లాడవ్. మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తవా..? దేశ రాజకీయాలు మార్చేందుకే బీఆర్ఎస్ పెట్టినం. నాడు తెలంగాణ పార్టీ పెడ్తె వచ్చేదా.. సచ్చేదా.. అన్నరు. తెలంగాణ తెచ్చినం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్తో ముందుకుకెళ్తం. అన్ని వర్గాలను సుఖసంతోషాలతో గొప్పగా బతికేలా తీర్చిదిద్దుతం. అందరి దీవెనలు గులాబీ జెండాకు ఉండాలని కోరుతున్నం.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్
గులాబీ జెండా ఎగురేస్తం
మంత్రి కేటీఆర్ రాకతో జమ్మికుంట ప్రాంతమంతా పులకించింది. భారీ స్వాగతం పలికిన ఇక్కడి ప్రజలకు కృతజ్ఞతలు. ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచి 14నెలలైంది. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా.. ఇప్పటి వరకు ఒక్క పైసన్నా తెచ్చిండా..? దొంగేడ్పులు తప్ప ఏం చేయలె? ఏం చేయాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యం. ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గం కళకళలాడేది. అయినా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. నాడు 2001లో మా నాన్న గులాబీ జెండా పట్టుకుని కేసీఆర్ సభ పెట్టిండు. ఇప్పుడు నేను కేటీఆర్ను తెచ్చుకున్న. జెండా పట్టుకున్న. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో మీ ముందు నిలబడుత. అందరి సహకారంతో గులాబీ జెండా ఎగురేస్తం. మునుగోడులో బీఆర్ఎస్ గెలిస్తే సీఎం రూ.వెయ్యి కోట్లిచ్చిండు. ఇక్కడ కూడా అలాగే అభివృద్ధి జరుగుతది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తది. ఇది రైతు, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం. ఇక్కడి ఆటగాళ్ల కోసం జమ్మికుంట, హుజూరాబాద్లో స్పోర్ట్స్ స్టేడియం కోసం 20కోట్లు ఇవ్వాలని, ఇల్లందకుంటలో ప్రభుత్వ కార్యాలయాల కోసం నూతన భవనాలను ఏర్పాటు చేయాలని అడిగినం. రాబోయే ఎండకాలంలో రాములోరి కల్యాణం జరుగుతది. రామన్న మీరు తప్పకుండా రావాలి.
– ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి
ప్రజలంతా సిద్ధంగా ఉండాలె
బీజేపీతో దేశానికి, రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. వారికి ఓటేస్తే అడుక్కుతినే రోజులు వస్తయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజవర్గంలో గులాబీ జెండా ఎగరేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలె. కరీంనగర్ అంటే కేసీఆర్కు ఎనలేని ప్రేమ. ఇక్కడి ప్రాంతమంటే నిధుల వరద పారిస్తరు. రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించాలన్నా హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎంచుకుంటరు. రైతుబంధు, దళిత బంధు ఇక్కడి నుంచే ప్రారంభించిన్రు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు మొదటి బీఆర్ఎస్ పెట్టిన్రు. కేటీఆర్ సభకు వేలాది మంది జనం వచ్చిన్రు. బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తున్నరు. ఇంతకంటే ఏం కావాలె? వచ్చే ఎన్నికల్లో దేశంలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం. సైనికుల్లా పనిచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నరు.
– కనుమల్ల విజయ, కరీంనగర్ జడ్పీఅధ్యక్షురాలు
బీజేపీని తరిమి తరిమి కొట్టాలే
జమ్మికుంటలో సభ పెడ్తమని కౌశిక్రెడ్డి అంటే.. ఏమో అనుకున్న. ఇంత పెద్దగా జరుగుతుందని అనుకోలే. దద్దరిల్లుతోంది. బీజేపోళ్లకు కండ్లు, పెయ్యి తిరిగేలా ఉంది. నేను నలభై ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఎందరో ముఖ్యమంత్రులను చూసిన. అందరిలో దమ్మున్న నాయకుడంటే కేసీఆర్ ఒక్కరే. బీజేపీ నాయకులు పిచ్చికూతలు కూస్తున్నరు. వాళ్లను మనం పట్టించుకోవద్దు. రాజకీయ జీవితాన్నిచ్చి, మంత్రిగా అవకాశం ఇచ్చిన పెద్ద మనిషిని మోసం జేసేటోన్ని మాత్రం వదిలి పెట్టకున్రి. నాటి ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం కొట్లాడినం. కెనాల్లో నీళ్లు లేవు. ఎస్సారెస్పీలో నీళ్లు లేవు. కరెంటు రాకపోయేది. మోటర్లు, మీటర్లు కాలిపోయేవి. 60 ఏండ్లలో ఏం సాధించలే. కానీ, తెలంగాణ వచ్చినంక పరిస్థితులు మారినయ్. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. నీళ్లు కాళ్లకాడికి వచ్చినయ్. బీడు భూములన్నీ పచ్చగా మారినయ్. చెర్లు, కుంటలు నిండినయ్. ఎస్సారెస్పీ కెనాల్ నిండు కుండలెక్క పోతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు. బీజేపీ పాలనలో ధరలు పెరిగినయ్. సామాన్యుడు బతుకుడు కష్టమైతంది. గెలిచిన బండి సంజయ్, ఈటల ఏం పగుల గొడ్తున్నరు? ఒక్క పైసా తేలే. అభివృద్ధి దిక్కు చూడలే. ఎందుకీ బీజేపీ? తరిమి తరిమి కొట్టాలే. మీ వెంట మేముంటం. సీఎంను ఒప్పిస్తం. ఎన్ని కోైట్లెనా ఇస్తం. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తం. దున్నపోతుకు గడ్డేయకున్రి. ఆవుకే గడ్డెయిన్రి. పథకాలస్తయ్. పాలన బాగా సాగుతది.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
బండి, ఈటల బీసీలకు అన్యాయం చేస్తున్నరు
ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. మన భవిష్యత్తు అంతా కేటీఆరే. ప్రతి పేదింటి బిడ్డ చదువుకోవాలని సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసిండు. తెలంగాణ ఆస్తులు మన గురుకులాలు. ఎన్నో పథకాలు అందిస్తున్న రాష్ర్టానికి కేంద్రం చేస్తున్న సాయం అంతంతే. బీసీ బిడ్డలంతా ఉచిత విద్యనందుకుంటున్నరు. కానీ, కేంద్రం బీసీ బిడ్డలకు నిధులెందుకు ఇవ్వడం లేదో చెప్పాలే. బీజేపీ కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలె. రూ.వెయ్యి కోట్లు కేటాయించాలె. 60శాతం బీసీలున్నరు. ఈ పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టాలె. ప్రత్యేక చట్టం తేవాలె. బీసీ బిడ్డలమని చెప్పుకుంటున్న ఈటల, బండిలిద్దరూ బీసీలకు న్యాయం చేయలె. బీసీలకు న్యాయం చేస్తే నా చేత్తో బంగారు కడియం తొడుగుత. లేకుంటే దోషుల్లా నిలబెడతం. మొన్నటి ఉప ఎన్నికల్లో ఓడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజల్లో ఉంటే, ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల, ఎంపీ బండి సంజయ్ కనబడకుండా పోయిన్రు. బీజేపీ సామాన్యుల పాలిట ట్రబుల్ ఇంజన్లా మారింది. ఆ పార్టీ నాయకులు మోసగాళ్లు. కేంద్రం నుంచి ఒక్క పైసా తేలె. అభివృద్ధి చేయలె. మనకా పార్టీ వద్దు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న బీఆర్ఎస్తో నడుద్దాం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానంలో వినోద్కుమార్ను గెలిపించుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 స్థానాల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా అందిద్దాం.
– మంత్రి గంగుల కమలాకర్
దేశంలోనే గొప్ప నాయకుడు కేటీఆర్
రాబోయే కాలానికి కాబోయే సీఎం కేటీఆర్. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలె. అభివృద్ధి. సంక్షేమమే మన తారక మంత్రం. ఇక్కడ గెలిచి మనం కేసీఆర్ సార్కు గిప్టునివ్వాలే. గత ఉప ఎన్నికల్లో తప్పిదం జరిగింది. దొంగేడ్పులు ఏడ్చిన ఈటల గెలిచిండు. పేదోన్నైనా నాకు అవకాశం ఇచ్చి పోటీ చేయాలని సీఎం ఆశీర్వదించిండు. ఇక్కడి ప్రజలు 83వేలకు పైగా ఓట్లేసిన్రు. గులాబీ పార్టీ వెంటనే ఉన్నామని చెప్పిన్రు. కేసీఆర్ ముఖంజూసి ఆదరించిన్రు. మీకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంట. ఈటల, బండి సంజయ్లిద్దరూ కల్లబొల్లి మాటలు జెప్పుతున్నరు. మోసం జేస్తున్నరు. అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోని నాయకులు మనకు అవసరం లేదు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి చేపట్టిన తర్వాత దేశంలోనే ఏ ఐటీ మంత్రి చేయలేని పనులు చేస్తున్నరు. పరిశ్రమలు తెస్తున్నరు. బీజేపీ రాష్ర్టాల్లోనూ మంత్రులున్నరు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు తెస్తున్నరా..? చెప్పాలె. కేవలం కేటీఆర్ మాత్రమే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నరు. ప్రపంచంలోని సంస్థలన్నీ రాష్ర్టానికి వస్తున్నయ్. పెట్టుబడులు పెడుతున్నయ్. ఉద్యోగాలొస్తున్నయ్. కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. కేంద్రంలో పరిశ్రమలశాఖ, ఐటీశాఖల మంత్రులున్నరు కదా.. ఎవరికన్నా తెలుసా..? కనీసం పేరైనా తెలుసా..? చెప్పాలే. ఎవరికీ తెలియదు. పనిజేసేటోళ్లు మాత్రమే ప్రజల నోళ్లలో నానుతరు. కేటీఆర్ పేరును గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తది. దేశంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఒక్కరే. ఆయన గొప్ప నాయకుడు. ఇది మనకు గొప్ప గర్వకారణం. బీఆర్ఎస్ ఉంటేనే రాష్ర్టానికి శ్రీరామరక్ష. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది.
– గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి