“మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు” ఇది సిరిసిల్ల బూర రాజేశ్వరి మనోగతం. దివ్యాంగురాలిగానే ఈ లోకంలోకి వచ్చిన ఆమె, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగింది. వైకల్యాన్ని అధిగమిస్తూ సాహిత్యంలో తన వేదనను, బాధను వ్యక్తీకరించడం మొదలు పెట్టింది. మాటలు సరిగా రాకపోయినా, చేతులతో రాయలేకపోయినా తన కాళ్లనే చేతులుగా మలుచుకుని అక్షరాలను కవితల రూపంలో ఎక్కుపెట్టింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బుధవారం తుదిశ్వాస విడిచింది.
– నేతన్న చౌరస్తా, డిసెంబర్ 28
సిరిసిల్ల సాయినగర్కు చెందిన బూర అనసూర్య-సాంబయ్య దంపతుల మూడో కూతురు రాజేశ్వరి. 1980లో జన్మించిన ఆమె, నడువలేదు. స్పష్టంగా మాట్లాడనూ లేదు. చేతులు వంకర్లు పోయినా, శరీరం వణుకుతున్నా, తల సరిగ్గా నిలబెట్టలేకపోయినా పట్టుదలతో ముందుకెళ్లింది. కాలి వేళ్లతో రాయడం నేర్చుకొని స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి దాకా చదివింది. తర్వాత ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ రాసి ఉత్తీర్ణత సాధించింది. వైకల్యం తన సాహిత్య సృజనకు అడ్డుకాదని నిరూపించింది. 1999 నుంచి కవిత్వాలు రాయడం మొదలు పెట్టింది.
రాజేశ్వరి సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. తన మనసులోని బాధలనే భావాలుగా మలుచుకొని, కవితలు రాయడం మొదలు పెట్టింది. ‘నేతన్నా మనిషి జన్మ చాలా అమూల్యమైంది. దాన్ని పూర్తిగా అనుభవించాలి’ అని నేత కార్మికులకు ధైర్యాన్నిచ్చింది. ‘మారదు ఈ లోకం.. మారదు. ఈ అమానుషం మారదు’ అని ఆడపిల్లపై వివక్షను నిరసించింది. రాజేశ్వరి ఇంట్లో కూర్చున్నా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ఉద్యమరూపాన్ని తన మనోనేత్రంతో చూసింది. ‘భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతుంది.. సాగుతుంది తెలంగాణ ఉద్యమం’అని ఉద్యమ కవిత్వాన్ని రాసింది. అమ్మపై రాజేశ్వరి రాసిన కవిత్వం అపురూపంగా ఉంది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చాటింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా రాజేశ్వరి ప్రపంచీకరణ వికృతరూపాన్ని మనసుతో గ్రహించింది. ‘ఎందుకిలా పుట్టించావు.. ఎందుకిలా బతికించావు.. ఎందుకిలా బాధిస్తున్నావు’ అంటూ ఆవేదనతో ఆ దేవుడిని ప్రశ్నించిన రాజేశ్వరి జీవితాన్ని మాత్రం సృజనాత్మకంగా తీర్చిదిద్దుకున్నది. తెలుగులోనే కాదు ఇంగ్లిష్లో కూడా మనసును తట్టిలేపే ఎన్నో కవితలను రాసింది. మొత్తంగా 500కు కవితలు అల్లి అందరినీ ఆలోచింపజేసింది. టీవీలో వచ్చిన రామయాణాన్ని చూసి రామకథకు రూపమిచ్చింది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు అందుకున్నది. ‘సిరిసిల్ల రాజేశ్వరి కవితలు’ పుస్తకాన్ని డాక్టర్ సినారె రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. రాజేశ్వరి గురించి తెలుసుకున్న ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ, స్వయంగా సిరిసిల్లకు వచ్చి తన తండ్రి సుద్దాల హనుమంతు జ్ఞాపక అవార్డును అందిం చారు. ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని జయించిన రాజేశ్వరి జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పుస్తకంలో చేర్చింది.
రాజేశ్వరి ప్రతిభను మెచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆమె పేరుమీద ప్రభుత్వం తరఫున 10లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేయించారు. ప్రతి నెలా 7వేల వడ్డీతోపాటు 3వేల పెన్షన్ ఇస్తున్నారు. రాజేశ్వరి ఉండేందుకు మండెపల్లి కేసీఆర్ కాలనీలో డబుల్బెడ్రూం ఇల్లును కూడా కేటాయించారు. మంత్రి అన్నిరకాలుగా అండగా నిలిచినా ఫలితం లేకపోయింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో కన్నుమూసింది. గురువారం అంత్యక్రియలు చేయనున్నారు.
నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకుని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతం. శరీరానికి వైకల్యం కానీ, ఆలోచనకు, ఆశయానికి కాదని తన మనోధైర్యంతో నిరూపించింది. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం. రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– మంత్రి కేటీఆర్
అంగవైకల్యాన్ని అధిగమించి కాళ్లతో కవితలు రాసేవారు దేశంలోనే ఉన్నారని వినలే. ఆత్మైస్థెర్యంతో ముందుకు వెళ్లింది రాజేశ్వరి. అలాంటి అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండేది. కానీ అనారోగ్యం ఆమెను వెంబడిస్తూనే ఉంది. కవిత్వం కూడా అలవోకగా రాసేది. బంగారు భవిష్యత్తు ఉన్న రాజేశ్వరి మరణించడం సాహితీ లోకానికి తీరని లోటు.
– పెద్దింటి అశోక్, సాహితీవేత్త
సిరిసిల్ల రాజేశ్వరి మృతి చాలా బాధాకరమైన విషయం. ఆమె రాసిన కవితలు పుస్తకంలో అచ్చు వేయించి.. హైదరాబాదులో రవీంద్రభారతిలో డాక్టర్ సీ నారాయణరెడ్డితో పుస్తకాన్ని ఆవిష్కరించా. ఆమె ఈ మధ్యే అనారోగ్యంగా ఉందని తెలిసి చాలా బాధపడ్డా. రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోకుండా కవితలు రాసి గొప్ప విజయాన్ని సాధించింది. ప్రాణం పోయేవరకు తన మనసులోని భావాలను ఆవిష్కరించింది. సిరిసిల్ల రాజేశ్వరికి నా జోహార్లు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. రాజేశ్వరిని ఇప్పటివరకు పెంచుకుంటూ వచ్చారంటే వాళ్ల కుటుంబ సభ్యులందరిది గొప్ప ఓపిక.
– సుద్దాల అశోక్తేజ, సినీ గేయ రచయిత
అంగవైకల్యాన్ని ఎదురించి తన కవితలతో ఎన్నో పురస్కారాలు అందుకున్న సిరిసిల్ల రాజేశ్వరి జీవితాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చడం చాలా గొప్ప విషయం. చాలా కవితలు రాసి సాహిత్యానికి వైకల్యం అడ్డురాదని నిరూపించింది. రాజేశ్వరి సాహిత్యం, కృషిని మెచ్చిన సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆమెకు సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. ఆయన చొరవతోనే మహారాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి గుర్తింపునివ్వడం విశేషం. కాళ్లతోనే కవితలల్లిన రాజేశ్వరి ఇక లేరు అనే వార్త జీర్ణించుకోలేకపోతున్న.
– కందేపి రాణిప్రసాద్, సాహితీవేత్త