మెట్పల్లి, ఆగస్టు 14 : పెన్షన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని, కానీ, ఈ ప్ర భుత్వం మాత్రం 3 లక్షల పెన్షన్లను తొలగించిందని వాపోయారు. తొలగించిన పెన్షన్లలో కొత్తగా రెండు లక్షల పెన్లన్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం హంగామా చేస్తున్నదని విమర్శించారు.
దరఖాస్తులో బీడీ కార్మికులకు ఆప్షన్ లేకుండా చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు జీవనభృతి పేరిట పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్దేనని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వకుండా అన్యాయం చేయడం దారుణమని ఆగ్రహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.