జ్యోతినగర్ (రామగుండం), జూలై 4 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వేలో బీఆర్ఎస్ శ్రేణులు బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సమన్వయంతో పని చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శనివారం రామగుండంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నగరంలోని 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ.. సర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ల వివరాల నమోదు, మార్పులతో అర్హులైన ఓటరు జాబితాలో పేరు ఉండేలా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. సర్ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
అనంతరం నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రామగుండం నగర ఇన్చార్జి బొడ్డుపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డి, 26వ డివిజన్ కార్పొరేటర్ బాదావత్ నర్సమ్మ సారయ్యనాయక్, మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి, తెలంగాణ ఉద్యమ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.