మారుతీనగర్, సెప్టెంబర్ 27: ఉమ్మడి పాలనలో అరిగోస పడ్డ నేత కార్మికులకు స్వరాష్ట్రంలోనే న్యాయం జరిగిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు నిండాయని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మంగళవారం మెట్పల్లి పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన గొప్ప పోరాటయోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. వచ్చే మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీ వర్గీయులకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే 400 మందికి గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందించామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఊర్లపై పడి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కోరుట్ల, మెట్పల్లి తనకు రెండు కండ్లలాంటివని చెప్పారు.
మహనీయుల చరిత్రను భావి తరాలకు తెలియజెప్పేందుకు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కోరుట్లలో మెట్పల్లి తొలి ఎమ్మెల్యే గంగుల భూమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బస్టాండ్ వద్ద ఏర్పాటు పనులకు భూమిపూజ చేశారు. ప్రజలకు సేవచేసేందుకు మీ ముందుకు వస్తున్న తన తనయుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను పద్మశాలీ కులస్తులు ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు ద్యావనపెల్లి రాజారాం మాట్లాడుతూ, గత పాలకులు నియోజకవర్గంలోని పద్మశాలీలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన తమకు ఎమ్మెల్యే విద్యాసాగర్రా వు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని ప్రకటించడం సంతోషమని చెప్పారు. ఇక్కడి యువత భవితకు భరోసానిస్తున్న డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకే అండగా ఉందామని పిలుపునిచ్చారు. అంతకు ముందు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.11కోట్లతో పాత బస్టాండ్, బస్డిపోల వద్ద నిర్మించిన ఫౌంటెన్లను (జంక్షన్ల) ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, పద్మశాలీ పట్టణాధ్యక్షుడు ద్యావనపెల్లి రాజారాం, ఆయా వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు.
మానాన్న విద్యాసాగర్రావును నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో విరివిగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు ఆయన బాటలోనే మీ ముందుకు వస్తున్నా. నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతా. ఇక్కడి పిల్లల భవిష్యత్ కోసం కోరుట్లను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతా. తెలంగాణ చరిత్రను, మహనీయుల జీవితవిశేషాలను తెలియజేసేందుకు వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తా. ఇదే కోవలో కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పా. ప్రజలు ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు. మన అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ను మూడోసారి సీఎంగా చూడాలంటే కారు గుర్తుకు ఓటేయండి.