ఎల్లారెడ్డిపేట, జనవరి 31: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం స్కూల్ బస్సును ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు గాయపడగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మండలకేంద్రానికి చెందిన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన బస్సులో అల్మాస్పూర్, రాజన్నపేటకు చెందిన 32మంది విద్యార్థులను ఎక్కించుకుని ఎల్లారెడ్డిపేటకు చేరుకున్నది. మండల కేంద్రంలోని రెండో బైపాస్లో స్కూల్ బస్ డ్రైవర్ ఇండికేటర్ ఇచ్చి మలుపుతిప్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఏర్పడిన బలమైన కుదుపు కారణంగా అందులో ఉన్న విద్యార్థులకు గాయాలు కావడంతో కేకలు వేయడం మొదలు పెట్టారు.
ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు సైతం గాయాలవడం చూసి డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్కూల్ బస్సులో ఉన్న ఎస్. రిహాన్, శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్, రిషిత్కుమార్, మల్లికార్జున్, మనస్విని, ఆదిత్య, మహేశ్, విహాన్, దినేశ్, ఆర్టీసీ బస్సులో ఉన్న రజిత, వినయ్కు తీవ్ర గాయాలవడంతో వారిని 108 వాహనంలో స్థానిక అశ్విని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు చాంద్పాషా, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, డీఈవో రాధాకిషన్ సిరిసిల్ల డీఎం మనోహర్, కామారెడ్డి డీఎం మల్లేశం విద్యార్థుల పరిస్థితిపై ఆరాతీసి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
మెరుగైన చికిత్సకు మంత్రి ఆదేశం
ప్రమాదం జరిగిన సమాచారం సోషల్మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ అనురాగ్జయంతిని ఆదేశించారు. దీంతో కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకుని మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తమ్ముడికేమైందోనని..
అప్పటి వరకు బస్సులో పాటలు పాడుతూ, మాట్లాడుకుంటూ, కేరింతలు వేస్తున్న విద్యార్థులు ఇంకా కొద్ది సేపయితే పాఠశాలకు చేరుకుంటామనుకునే క్రమంలో పెద్ద శబ్దంతో కుదుపుకు లోనవగా కొందరు విద్యార్థులకు రక్తగాయాలయ్యాయి. అందులో నుంచి అల్మాస్పూర్కు చెందిన రోండ్ల శ్రీనివాస్రెడ్డి అనే బాలుడికి తల, చెంపకు గాయాలై రక్తం కారుతున్న క్రమంలో అందులోనే ఉన్న అతని సోదరుడు శివారెడ్డికి కూడా గాయాలైనా పట్టించుకోకుండా తమ్ముడికి ఏమైందోనని కంగారుపడ్డాడు. తమ్ముడి ముఖంపై రక్తం కారడం చూసి చలించిపోయి తమ్ముడి ముఖాన్ని ఏడుస్తూ తడుముతున్న తీరు చూసి పలువురు కంటతడి పెట్టారు.