కార్పొరేషన్, ఆగస్టు 4 : ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురాలని, ఆ మేరకు 9వ తేదీ నుంచే ఇంటింటికీ పతాకాలను పంపిణీ చేయాలని సూచించారు. విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
వజ్రోత్సవాల నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లాస్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నదన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో కలిగేలా ఈ నెల 8 నుంచి 20వరకు కార్యక్రమాలను నిర్వహించాలని, ఆ మేరకు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆగస్టు 15న కరీంనగర్ జిల్లాలో 3,08,427 గృహాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని, ప్రతి ఒకరూ భాగస్వాములను చేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 8న వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని చేపట్టాలన్నాఉ.
ఈ నెల 11న ఫ్రీడం రన్ను అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ వరకు 50వేల మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ప్రసాద్ లాల్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.