‘మన ఊరు.. మన బడి’లో భాగంగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాసముదాయం దేశానికే తలమానికంగా రూపుదిద్దుకున్నది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు అమాత్యుడు రామన్న చొరవతో అద్భుతంగా నిర్మాణమైంది. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్ స్పేస్ రిట్, యశోదా హాస్పిటల్, ఎమ్మార్ఎఫ్, దివీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్కో సహకారంతో ఆరెకరాల్లో 11.50 కోట్లతో నిర్మించిన ఈ సముదాయం బుధవారం మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. రేపటి పౌరుల ఆనందాలు.. అమాత్యుల పలకరింపులు.. భవిష్యత్ తరాలకు అందించిన బహుమానంతో ప్రాంగణం పులకించింది. వేలాది మంది విద్యార్థులతో సందడిగా మారింది.
సిరిసిల్ల/ గంభీరావుపేట, ఫిబ్రవరి 1 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం గంభీరావుపేటలో పర్యటించారు. ‘మన ఊరు.. మన బడి’లో భాగంగా నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఇద్దరు మంత్రులకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు క్యాంపస్ను ప్రారంభించి, క్యాంపస్లో కలియదిరిగారు. ముందుగా లైబ్రరీలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో మాట్లాడి, సెల్ఫీలు దిగారు. కష్టపడి చదివి కొలువు సాధించాలని సూచించారు. ప్రాంగణంలో ఉన్న కుట్టు శిక్షణ నైపుణ్య కేంద్రంలోని శిక్షణ పొందుతున్న మహిళలను పలుకరించారు.
అక్కడి నుంచి పీజీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ‘మన ఉరు.. మన బడి’ తెలంగాణ సింబల్ వద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. అక్కడి నుంచి సభావేదిక వద్దకు వెళ్లారు. ప్రసంగం తర్వాత భవిత కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు అందించిన పుష్పగుచ్ఛాలను మంత్రులు తీసుకొని, ఆప్యాయంగా ముచ్చటించారు. ఆ తదుపరి భోజనశాలకు వెళ్లారు. వెయ్యి మంది ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాలును చూసి మంత్రి సబిత ఆశ్చర్యపోయారు. తాను ఇంత వరకు ఇలాంటి డైనింగ్ హాలు, అది ఓ పాఠశాలలో చూడలేదని కేటీఆర్పై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో కలిసి మంత్రులు సహపంక్తి భోజనం చేశారు. వారు భోజనం చేయడంతోపాటూ చిన్నారులకు వడ్డించారు. భోజనాల రుచి ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. భోజనం చేసిన తర్వాత మంత్రి కేటీఆర్ అక్కడే పిల్లలకు షేక్ హ్యాండ్ ఇస్తూ పలుకరించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.
విద్యార్ధినితో సహంపక్తి భోజనం చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అభివృద్ధి చేయడం కష్టం. రాజకీయాలు చేయడం సులువు. ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలి. నోరుందని మాట్లాడడం సరికాదు. ప్రజలకు నచ్చేలా అభివృద్ధి చేయడం, ఆదర్శనీయమైన పథకాలు అమలు చేయడం కష్టం. 24 గంటల కరెంటు ఇవ్వడం కష్టం, ఇంటింటికీ తాగునీర్విడం కష్టం, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం, నాణ్యమైన విద్యకు విద్యాలయాలు, సంపూర్ణ ఆరోగ్యానికి ఉచిత వైద్యం అందించడం కష్టం. కానీ, మనసున్న సీఎం కేసీఆర్ సహకారంతో మేం కష్టపడి ఫలాలు అందిస్తున్నం. పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నం.
ఉద్యమ సమయంలో సుమారు 19 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు గంభీరావుపేటలో కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాం. 2004 సెప్టెంబర్ 17న ఉద్యమ సమయంలో కేసీఆర్ గంభీరావుపేటలో పర్యటించారు. అప్పుడు ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేజీ నుంచీ పీజీ వరకు విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు రాష్ట్రంలో మొట్టమొదటగా కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాం.
క్యాంపస్కు ఆచార్య జయశంకర్ పేరు
కేజీ టూ పీజీ విద్యా సముదాయానికి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ సభావేదికపై ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఈ ప్రాంగణంలో విగ్రహాన్ని కూడా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సహకరించిన ప్రతినిధులకు సన్మానం
కేజీ టూ పీజీ విద్యా సముదాయ నిర్మాణానికి సహకరించిన పలు కంపెనీల ప్రతినిధులను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు. రహేజా సంస్థ ప్రతినిధి శ్రవణ్కుమార్, దివీస్ ల్యాబ్ ప్రతినిధి మధుబాబు, ఎంఆర్ఎఫ్ ప్రతినిధి శిబుభ్యాం, గ్రీన్కోకు చెందిన సంకేత్కు శాలువా కప్పి సన్మానించారు.
కొండూరి సంకేత్కు అభినందనలు
సిరిసిల్ల జిల్లాలోని విద్యాలయాలు చక్కదిద్దడంలో అజ్ఞాత సూర్యుడు కొండూరి సంకేత్రావు ఎంతో శ్రమ, కఠోర దీక్ష ఉంది. నా తమ్ముడితోనే విద్యాలయాలు చక్కగా చక్కదిదద్దడం సాధ్యమైంది. ఏమి ఆశించకుండా సమగ్రాభివృద్ధి చేస్తున్న వారికి, వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. గంభీరావుపేటలో అందమైన కేజీ టూ పీజీ విద్యాలయాన్ని నిర్మాణం చేయించిన తమ్ముడు సంకేత్కు అభినందనలు.
– మంత్రి కేటీఆర్