రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ)/ గంభీరావుపేట, జనవరి 31 : ‘మన ఊరు- మన బడి’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్ రూపుదిద్దుకున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ, కార్పొరేట్ సంస్థల సహకారంతో గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో ఆధునిక సముదాయం నిర్మాణమైంది. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్ స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్ఎఫ్, డీవీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్కో సహకారంతో 3కోట్లతో సకల వసతులతో దీనిని నిర్మించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు.
50 కంప్యూటర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకేంద్రం సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని సిద్ధం చేశారు. ఈ కేజీ టూ పీజీ క్యాంపస్ను బుధవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితోపాటు నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు క్యాంపస్ను పరిశీలించారు.
ఆనందంగా ఉన్నది
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి గంభీరావుపేటలో కేజీ టూపీజీ విద్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అంగన్వాడీ నుంచి డిగ్రీ దాకా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి వసతులను చూసి విద్యార్థులు అబ్బురపడుతున్నారు. ఈ విద్యాలయం బంగారు తెలంగాణకు నిదర్శనంగా చెప్పవచ్చు. విద్యారంగం ఎంతగా బలోపేతమవుతున్నదో చెప్పడానికి ఇదే ఉదాహరణ.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్ కాబ్ చైర్మన్
మా ఊరిలోనే చదువుకునే అవకాశం
మాది గంభీరావుపేట. ఇక్కడే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీకాం పూర్తి చేసిన. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఉన్నత చదువుకొనే అవకాశం లేదని బాధపడ్డ. అయితే ఇప్పుడు మ ఊరులోనే పీజీ సీటు రావడంతో చాలా సంతోషంగా ఉన్నది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇంత మంచి విద్యనందించడం గొప్ప విషయం. బాగా చదువుకొని మంత్రి కేటీఆర్ నమ్మకాన్ని నెలబెడతా.
– నీలిమా, పీజీ(ఎమ్కాం) విద్యార్థిని
వాతావరణం చాలా బాగున్నది
పాఠశాల వాతావరణం చాలా బాగున్నది. కేజీ టూ పీజీ గేటు లోపలికి రాగానే కార్పొరేట్ విద్యాలయాలకు వెళ్లిన అనుభూతి కలుగుతున్నది. మధ్యాహ్న భోజన సమయంలో తినడానికి డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అందరం ఒకే చోట కూర్చోని కలసి భోజనం చేయడం మాకు సంతృప్తినిస్తున్నది. ఇంత మంచి వసతులు కల్పించిన మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పెద్దవేని సహస్ర, 6వ తరగతి
గంభీరావుపేట, జనవరి 31: ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మనబడి కార్యక్రమంలో రూ. 3.50కోట్లతో గంభీరావుపేటలో నిర్మించిన కేజీటూపీజీ క్యాంపస్ భవనాన్ని ప్రారంభిస్తారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 పాఠశాలలను అక్కడే ప్రారంభిస్తారు. అనంతరం వేలాది మంది విద్యార్థులతో ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత వెయ్యి మంది విద్యార్థులతో కలసి భోజన శాలలో మధ్యాహ్న భోజనం చేస్తారు. అందుకు సంబంధించిన వివరాలను నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూర్ రవీందర్రావు వెల్లడించారు. మంగళవారం గంభీరావుపేటలోని కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణంలో చేపడుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు, నేతలతో కలిసి పరిశీలించారు. మంత్రి కేటీఆర్ చొరవతో కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. నేడు ప్రారంభం చేసుకోవడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, ఉప సర్పంచ్ సింగారపు నాగరాజుగౌడ్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, పెద్దవేని వెంకటియాదవ్, గంద్యాడపు రాజు, లింగంయాదవ్, జంగంపల్లి శేఖర్గౌడ్, చెవుల మల్లేశం, అభిలాష్, ఆనందం, వహీద్, ఎగదండి స్వామి తదితరులు ఉన్నారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్
కేజీ టూ పీజీ విద్యాలయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మన ఊరు -మన బడిలో భాగంగా గంభీరావుపేటలో నిర్మించిన ఈ క్యాంపస్ను బుధవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి తాను ప్రారంభిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.