మానకొండూర్, నవంబర్ 23: కాంగ్రెస్ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంది తప్ప వారి సంక్షేమానికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. బుధవారం మానకొండూర్ మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలనలో వెనుకబడిన తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతే అన్ని రంగాల్లో అభివృద్ధి సా ధించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, అభివృద్ధి కుంటుపడుతుదని కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్ద లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని వాపోయారు. ఉద్యమనేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి చేపట్టిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ ఏర్పడిందే తప్ప కాంగ్రెస్ పెట్టిన భిక్ష కాదన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ మత ఘర్షణలు, కర్ఫ్యూలు జరుగుతుండేవని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో అవి మచ్చుకైన లేవని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో దుర్భర జీవితం గడిపిన మైనార్టీలకు బీఆర్ఎస్ పాలనలోనే మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు, సాగు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణంతో తాగు, సాగు నీరు పెరగడమే కాకుండా ధాన్య ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నిజమైన సెక్యులర్ నాయకుడని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లు కైవసం చేసుకుంటుందని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండి ఉద్యమ పాటలతో ప్రజలను చైతన్యవంతం చేసిన మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, మైనార్టీ నా యకులు అక్బర్హుస్సేన్, జమీలుద్దీన్, సయ్యద్ ఖలీల్ మోహియెద్దీన్, లాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.