పెద్దపల్లి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కార్పొరేషన్/ జగిత్యాల : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫాంలు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదేనని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థులకు బీ ఫాంలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా పోరాడితే మంచి ఫలితాలు వస్తాయని, మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని సూచించారు. మన ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లితోపాటు నిజమామాబాద్ లోక్సభ సెగ్మెంట్ అభ్యర్థులు బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ బీ ఫాంలు అందుకున్నారు. వారివెంట పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.