కాబోయే తల్లుల ఆరోగ్యంపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. గర్భిణులకు అందించే పౌష్టికాహారానికి ఎగనామం పెట్టింది. జన్మనిచ్చే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిన న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని అటకెక్కించింది. ప్రభుత్వం మారడంతోనే పాత స్కీంను పక్కన పెట్టేసి, రెండు నెలలుగా పంపిణీని నిలిపివేసింది. దీంతో ఆడబిడ్డలకు పోషకాహారం అందకుండా పోతుండగా, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): ‘కాబోయే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. కడుపులో బిడ్డ మంచిగా ఎదగాలి’ అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని భావించింది. ఆ మేరకు గతేడాది అక్టోబర్లో న్యూట్రిషన్ కిట్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైసా ఖర్చులేకుండా ఉచితంగా అందజేసింది. కిలో ప్రొటీన్ పౌడర్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్స్, బెల్లం పల్లిపట్టీలు, ఇతర పదార్థాలతో కిట్లో ఉంచి నాలుగో నెలలో ఒకసారి, ఎనిమిదో నెలలో ఒకసారి పంపిణీ చేసింది.
గత ప్రభుత్వం బృహత్తర లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినా, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు పంపిణీకి బ్రేక్ వేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పథకం దాదాపుగా నిలిచిపోయినట్టు తెలుస్తుండగా.. పెద్దపల్లి జిల్లాలోని 18 పీహెచ్సీలు, 6 యూపీహెచ్సీలు, మూడు సీఎఫ్ డబ్ల్యూసీ కేంద్రాల పరిధిలో మాత్రం మొత్తంగా ఆగిపోయింది. ఇక రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా దవాఖాన, మంథని సివిల్ దవాఖానకు రావడం లేదు. కేవలం రామగుండం జనరల్ దవాఖాన (గోదావరిఖని)లో మాత్రమే కిట్లు అందుబాటులో ఉన్నాయి.
అవి కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసినవే. కాగా, జిల్లాలో పథకం ప్రారంభ సమయంలో జిల్లావ్యాప్తంగా 5,596 మంది గర్భిణులకు కిట్లు అందాయి. వాటి పరిధిలో 12 నుంచి 24 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28వారాల నుంచి 34వారాల గర్భిణులకు రెండో కిట్ ఇచ్చారు. కాగా, అప్పుడు మొదటి విడత కిట్ తీసుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో నెలకు వచ్చారు. కిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్నారు. స్థానిక పీహెచ్సీలు, దవాఖానలకు వెళ్లి వైద్యాధికారులను అడుగుతున్నా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
జన్మనిచ్చే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని ప్రారంభించాం. అయితే, రెండు నెలలుగా జిల్లాకు నూట్రిషన్ కిట్లు రావడం లేదు. త్వరలోనే వచ్చే అవకాశమున్నది. రాగానే జిల్లా వ్యాప్తంగా అందిస్తాం.
– డా. ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో (పెద్దపల్లి జిల్లా)