కరీంనగర్, జవవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్మియా వాగుపై పలుచోట్ల కేసీఆర్ సర్కారు చెక్డ్యాంలను నిర్మించింది. గతంలో ఎక్కడికక్కడే నీళ్లు నిండి ఉండడంతో వాగుకు ఇరువైపులా ఉన్న రైతులు మోటర్లు పెట్టుకొని వేలాది ఎకరాలు సాగు చేసేది. ప్రస్తుతం కూల్చివేయాలని చూసిన చెక్ డ్యాంను పెద్దపల్లి మండలం భోజన్నపేట-మూలసాల వద్ద 2018లో 4.19 కోట్లతో కట్టింది. ప్రస్తుతం దీనికి ఎగువన కిలో మీటర్ వరకు బ్యాక్ వాటర్ ఉన్నది. అయితే సోమవారం రాత్రి చెక్డ్యాంకు పదకొండు చోట్ల డ్రిల్ వేసి, జిలెటిన్ స్టిక్స్తో పేల్చే కుట్ర జరిగిన విషయం తెలిసిందే.
నిజానికి ఇక్కడ భారీ కుట్ర జరిగిందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కొత్తపల్లికి చెందిన రైతు చాట్ల సదయ్య బాపమ్మ సోమవారం సాయంత్రం చనిపోవడంతో రాత్రి పూట చెక్ డ్యాం సమీపంలోని పొలం వద్ద దహన సంస్కారాలు చేశారు. స్నానాలు చేసేందుకు ఆ గ్రామానికి చెందిన రైతులు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దొంగ చాటున జిలెటిన్స్టిక్స్ పెట్టి పేల్చేందుకు కంప్రెషర్తో డ్రిల్లింగ్ చేస్తున్న పనులను చూశారు. వెంటనే అనుమానం వచ్చిన సదరు గ్రామస్తులు ఒక్కసారిగా పెద్ద కేకలు వేశారు. దాంతో ఆగంతకులు పారిపోయారు.
నిజానికి రైతులు ఆ సమయానికి అక్కడ లేకపోతే.. చెక్డ్యాం కచ్చితంగా కూల్చివేసేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక ఓ మాజీ ప్రజాప్రతినిధి కుట్ర దాగి ఉందని, సంచనలం సృష్టించేందుకు ఇలా చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సదరు మాజీ ప్రజాప్రతినిదే.. జిలెటిన్స్టిక్స్, ఇతర పరికరాలు సమకూర్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద కేసులను సైతం గంటల్లో ఛేదించే పోలీసులు, విచారణలో అనుకున్నంత స్పీడ్ ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రైతులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించి.. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు పంటలకు జీవం పోసే ఒక చెక్డ్యాంను కూల్చివేసే సాహసం రైతులు చేయరన్న గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని పని ఇప్పుడెందుకు చేస్తారన్న ప్రశ్నిస్తున్నారు నిజంగా చెక్డ్యాం కింద రైతులకు నీళ్లు అవసరముంటే ప్రజాస్వామిక పద్ధతిలో అడిగేవారని, ఇలా చేయరని స్పష్టం చేస్తున్నారు.