సుల్తానాబాద్, జనవరి 5 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీలించింది. అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నది. శుభ్రత విషయంలో సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బృందం సభ్యుడు సూపరింటెండెంట్ ప్రహ్లాద్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ, విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నదన్నారు. ఒకప్పుడు సర్కారు దవాఖానకు రావాలంటే బయపడ్డ ప్రజ ల్లో ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులతో పాటు, అవసరమైన సిబ్బందిని, అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నదన్నారు. కాయకల్ప పథకంలో భాగంగా యేటా స్వచ్ఛత, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవల్లో ముందు వరుసలో ఉండే దవాఖానలను ఎంపికచేస్తున్నట్లు చెప్పారు. అందులో మొదటి బహుమతిగా రూ.20 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.10 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.లక్ష అందిస్తున్నట్లు వెల్లడించారు. సుల్తానాబాద్ దవాఖాన 2019లో ప్రథమ.., 2020లో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచేలా సిబ్బంది పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమాదేవి, హెడ్ నర్స్ ఏసుమనీ, జూనియర్ అసిస్టెంట్ మౌనిక, వైద్యులు రామ్మోహన్, శ్రీధర్, సునీత, తనూజ, అరుణ, మహేందర్, దవాఖా సిబ్బంది తదితరులు ఉన్నారు.