పేదల ఆకలి తీరుస్తున్న కరీంనగర్ బల్దియా
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మధ్యాహ్నం పూర్తి ఉచిత భోజనం
నగరంలోని మూడు సెంటర్లలో నిత్యం 900 మందికి మీల్స్
రోజుకు 22,500 భారమైనా అన్నార్తులకు భరోసా
ఆపత్కాలాన కరీంనగర్ బల్దియాలో పేదల ఆకలి తీరుస్తున్నారు. మొన్నటి వరకు 5కే భోజనం అందించగా, లాక్డౌన్ వేళ అన్నార్తులెవరూ పస్తులుండొద్దన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఉచితంగా పెడుతున్నారు. నగరంలోని కళాభారతి, జిల్లా గ్రంథాలయంతోపాటు జిల్లా ప్రభుత్వ దవాఖాన వద్ద నిత్యం అసహాయులు, అభాగ్యులు, పేదలు, కూలీల కడుపునింపుతున్నారు. బల్దియాపై రోజుకు 22,500 భారం పడుతున్నా, 900 మందికి మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, నిత్యం 1500 మందికి భోజనం అందేలా చూస్తామని మేయర్ సునీల్రావు తెలిపారు.
కరీంనగర్ కార్పొరేషన్, మే 21 : కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని పేదల ఆకలి తీర్చే ఉద్దేశ్యంతో రాష్ట్ర సర్కారు 5 భోజనం పథకాన్ని తెచ్చింది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్ల క్రితమే కరీం‘నగరం’లో ప్రారంభించగా, నిత్యం మధ్యాహ్నం పూట వందలాది మంది పేదల ఆకలితీరుస్తున్నారు. ఇది విజయవంతంగా అమలవుతుండగా, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో లాక్డౌన్ వేళ పేదలకు ఉచితంగానే భోజనం అందించాలని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి పూర్తి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఇప్పటి వరకు కళాభారతి, జిల్లా గ్రంథాలయం వద్ద భోజనం పెట్టగా, ఇప్పుడు జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వద్ద మరో సెంటర్ ఏర్పాటు చేశారు. ఆయాచోట్ల ప్రతి రోజూ మధ్యాహ్నం 900 మందికి కడుపు నింపుతున్నారు. అన్నంతోపాటు పప్పు, సాంబారు, కర్రీ, పచ్చడితో భోజనం అందిస్తున్నారు. మంచినీటి ప్యాకెట్ కూడా ఇస్తున్నారు.
ఫ్రీగా భోజనం పెడుతున్నరు..
మంచి రుచికరమైన కూరలతో అన్నం కడుపు నిండా పెడుతున్నరు. ఇంత మంచి భోజనం హోటళ్లలో కూడా పెట్టరు. కరీంనగరంల ఏదో పని చేసుకుని బతికిటోన్ని. ఇప్పుడు లాక్డౌన్తో పని లేకుండా పోయింది. ఇట్లాంటి సమయంల మాకు ఫ్రీగా భోజనం పెడుతున్నరు. కూరలు ఎంతో రుచిగ, మంచిగ ఉన్నయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూ ఇక్కడే తింటున్న.
అవసరమైతే కేంద్రాలను పెంచుతాం
మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ప్రజలకు ఉచితంగానే భోజనం అందించాలని నిర్ణయించాం. ఇప్పుడు మూడు కేంద్రాల్లో పెడుతున్నాం. అయితే, అవసరాలకు అనుగుణంగా మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నిత్యం 1500 మందికి అందేలా చూస్తాం. ఎంతో మంది పేదలు, కార్మికులు, అభాగ్యులకు కడుపునిండా భోజనం దొరుకుతున్నది. ఇంకా మరింత మందికి అందిస్తాం.
కడుపు నిండా తింటున్న
ఇంతకు ముందు ఇక్కడే రోడ్లపై చిన్న పనులు చేసుకునేటోన్ని. 5 పెట్టి భోజనం చేసేటోన్ని. ఇప్పుడు లౌక్డౌన్ అని ఫ్రీగనే పెడుతున్నరు. నేను రోజూ ఇక్కడే తింటున్న. కడుపునిండా భోజనం చేస్తున్న. ఈ సాయం మరిచిపోను.
భారమైనా ఉచితం
ఒక్కో భోజనానికి 25 వ్యయం అవుతున్నది. అందులో ఇప్పటి వరకు 20 బల్దియా చెల్లిస్తున్నది. 5 ప్రజలు చెల్లించాల్సి ఉండేది. పది రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో పూర్తిగా ఉచితంగా భోజనం అందించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ప్రతి రోజూ 22,500 భారం భరించి, 900 మందికి భోజనం పెడుతున్నది. మంచి టేస్టీగా, ఫ్రీగా పెడుతుండడంతో పేదలు ఇష్టంగా తింటున్నారు. లాక్డౌన్ సమయంలో తమ కడుపు నింపుతున్నారని సంతోషపడుతున్నారు.
పేదలంతా రుణపడి ఉంటరు..
ఇక్కడే రోడ్డుపై సోడా బండి నడుపుకుంటున్న. రోజూ మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తున్న. ఇంటి భోజనం ఉన్నట్లుగానే ఎంతో రుచికరంగా ఉంది. ఇంత మంచి భోజనాలు ఎక్కడా పెట్టరు. లాక్డౌన్లో వ్యాపారం సాగడం లేదు. ఈ సమయంల ఉచితంగా అన్నం పెడుతున్నరు. పేదలంతా రుణపడి ఉంటరు.