ఫర్టిలైజర్సిటీ, సెప్టెంబర్ 21: ట్రాఫిక్ పోలీసు లేడని సిగ్నల్స్ జంప్ చేస్తున్నారా.. మమ్మల్ని ఎవరూ చూడడంలేదని ఒకే బండిపై ముగ్గురు బలాదూర్గా వెళ్తున్నారా? హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడుపుతున్నారా? పరిమితికి మించి వేగంతో వెళ్తున్నారా? అయితే వాహనదారులు తస్మాత్ జాగ్రత్త..ఎందుకంటే మూడోకన్ను(సీసీ కెమెరా)లో చూసి జరిమానా విధించే విధానం రామగుండం కమిషనరేట్ పరిధిలో అమల్లోకి వచ్చింది. ‘ఆటోమెటిక్ క్లిక్..కమాండ్ కంట్రోల్ సిస్టం’ ద్వారా ఈ చలానా విధించే అవకాశం ఉన్నది.
ఫర్టిలైజర్సిటీ, సెప్టెంబర్ 21 : రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆటోమెటిక్ క్లిక్.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం అమల్లోకి వచ్చింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సీసీ కెమెరాలను డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్తో కనెక్ట్ చేశారు. దీని ద్వారా రామగుండంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వాహనాల రాకపోకలను పరిశీలిస్తారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే వెంటనే గుర్తించి ఈ-చలానా విధిస్తారు. ఈ అధునాతన పద్ధతి ద్వారా ట్రాఫిక్ నిబంధనలు మరింత కట్టుదిట్టంగా అమలుచేసే అవకాశం ఉంటుంది. వాహనదారులు సైతం ట్రాఫిక్ రూల్స్ను కచ్చితంగా పాటించే పరిస్థితి ఉంటుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. పర్యవేక్షణ సైతం సులువేనని పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల పనితీరును అడ్మిన్ డీసీపీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడారు. కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ పరిధిలోని సీసీ కెమెరాలు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్తో కనెక్ట్ చేశామన్నారు. దీంతో వాహనదారులకు హెల్మెట్ లేకపోయినా, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ను జంప్చేసిన ఆటోమేటిక్గా సీసీ కెమెరాల ద్వారా ఈ చలానా పడుతుందన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ట్రాఫీక్ సీఐ ప్రవీణ్కుమార్, ఆర్ఐ మధూకర్, ఇన్స్పెక్టర్ శ్రీధర్, కమ్యూనికేషన్ అండ్ ఐటీ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ ఉన్నారు.