స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు రెండేళ్లుగా ప్రోత్సాహమిస్తున్నది. సంఘానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి, ప్రధానంగా నిత్యావసర వస్తువుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నది. బ్యాంకుల ద్వారా లక్ష నుంచి పది లక్షల దాకా లోన్ ఇప్పిస్తుండగా, మహిళలు ఇక నుంచి మినీ ఇండస్ట్రియలిస్టులుగా మారే అవకాశమున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 7 : స్వయం సహాయక సంఘాల్లోని పేదింటి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే పలు రకాల రుణాలు అందిస్తున్నది. అయితే ఆ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, ఇతర దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వినియోగిస్తుండడంతో సరికొత్త ఆలోచనలు చేసింది. రోజువారీ ఆదాయ మార్గాలు చూపుతూ, మరికొందరికి ఉపాధి కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు రెండేళ్లుగా మినీ ఇండస్ట్రీస్ స్థాపించే మహిళలకు పెద్ద మొత్తంలో రుణాలందిస్తున్నది. ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకంలో భాగంగా ఒక్కో యూనిట్కు గరిష్ఠంగా లక్ష నుంచి 10లక్షల దాకా కూడా రుణ సదుపాయం కల్పించేలా బ్యాంకర్లతో ఒప్పందం చేసుకున్నది. లబ్ధిదారులకు ఔత్సాహిక యూనిట్లు స్థాపించుకునేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల నుంచి ఎంపిక చేసిన 161 మందికి వివిధ బ్యాంకుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 4,05,58,500 రుణాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. కేవలం 10 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తే, మిగతా 90 శాతం బ్యాంకుల నుంచి రుణ రూపంలో తీసుకుని, ఎంపిక చేసిన మహిళా సభ్యురాలు పరిశ్రమ ఏర్పాటు చేసుకునేలా సహకరిస్తున్నది. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం మూడేళ్లపాటు క్రమం తప్పకుండా చెల్లించిన అనంతరం 35 శాతం సబ్సిడీ కూడా అందించనున్నది.
నిత్యావసర వస్తువుల తయారీకి ప్రాధాన్యం
ఎంపికైన మహిళా సంఘాల సభ్యుల వివరాలు, వారు ప్రారంభించబోయే మినీ ఇండస్ట్రీల వివరాలతో కూడిన జాబితాలు ఇప్పటికే జిల్లాలోని వివిధ బ్యాంకులకు చేరాయి. త్వరలోనే వీరికి రుణాలు కూడా విడుదల చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం కృషి చేస్తున్నది. నిత్యావసర వస్తువుల యూనిట్లు ఏర్పాటు చేసుకుని నిరంతర ఆదాయం పొందేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎంపిక చేసిన మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా పిండి గిర్నీలు, ఆహార పదార్థాల తయారీ యూనిైట్లెన అల్లం, వెల్లుల్లి, పసుపు, కారంపొడి, నూనె తయారీ, గానుగ నూనె, పచ్చళ్లు, అటుకులు, పిండి వంటల తయారీ పరిశ్రమలు స్థాపించుకునేలా సూచిస్తుండగా, ఎంపికైన యూనిట్లలో దాదాపు 90శాతం మంది వీటినే ఎంచుకున్నారు. అలాగే ప్రస్తుతం నిర్వహిస్తున్న చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేసుకునే వారికి కూడా రుణాలు ఇస్తున్నారు. ఈ పథకం కింద గతేడాది జిల్లాలోని 369 యూనిట్లకు సీడ్ క్యాపిటల్ కింద ఒక్కో యూనిట్కు 40వేల చొప్పున 1,46,21,500 విడుదల చేశారు. స్వయం సహాయక సంఘాలకు అందజేసే రుణ విధానంలో మార్పులు, చేర్పులు జరిగిన నేపథ్యంలో ఇకనుంచి రుణ సాయం పొందేవారు ఆదాయం వచ్చే పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేసుకునేలా అధికారులు సంఘాలకు అవగాహన కల్పిస్తున్నారు. తొలివిడత రుణం తీసుకున్న సంఘాల సభ్యులు సక్రమంగా చెల్లిస్తే, రెండో విడతలో వారికి 5లక్షల వరకు రుణం పొందేలా వెసులుబాటు కల్పించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. దీంతో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి బ్యాంకర్లే పిలిచి కొత్త రుణాలు మంజూరు చేస్తుండడం కూడా మహిళా సంఘాలకు కలిసివస్తున్నది.
ఎదిగేందుకు అవకాశం
పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో పుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో ఎంపికై రుణాలు పొందే మహిళలు, చిన్న పరిశ్రమల యజమానులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా నిత్య ఆదాయ మార్గాలు చూపే యూనిట్లు ఎంపిక చేసుకుని, లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాల పరిశ్రమలు స్థాపించుకుని, నిర్వహిస్తే అత్యధిక లాభాలు పొందవచ్చు. రుణ గ్రహితలు క్రమం తప్పకుండా చెల్లిస్తే, 35శాతం మేర సబ్సిడీ కూడా పొందేందుకు అర్హులు. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు మరి కొద్ది మంది తోటి మహిళలకు ఉపాధి కల్పించే అవకాశాలుంటాయి.
– ఎల్ శ్రీలత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి (కరీంనగర్)