విద్యానగర్/ముకరంపుర, డిసెంబర్ 22 : కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే అందుబాటులో ఉండగా, మరో రెండు రోజులు నడిపించనున్నారు. ఇప్పటి వరకు రెండు సర్వీసులు మాత్రమే ఉన్నందున ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా రైలు సర్వీసుల సంఖ్య పెంచాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం ఢిలీల్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు వారానికి నాలుగు రోజుల పాటు కరీంనగర్-తిరుపతి రైలు నడిపించేందుకు మంత్రి సానుకూలంగా స్పందించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు సమాచారం. అదే విధంగా కరీంనగర్ – హసన్పర్తి కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి, కొత్త రైల్వే లేన్ పనులను మంజూరు చేయాలని ఎంపీ మంత్రిని కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి ఫైనల్ లొకేషన్ సర్వే పనులను సత్వరమే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జమ్మికుంట స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్(12590-89), యశ్వంతపూర్- గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (12592-91), హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ (12723-23), సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్ (12791-92), చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్, (12656-55) రైళ్లను ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలేన్కు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి దుర్వాసన వస్తున్నందున, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు 11ఏ, 16ఏ, 26, 101, 123ఏ, 134ఏ, 140ఏ, 164, 175ఏ, 775ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) డ్రైనేజీలను మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.