కరీంనగర్ వన్టౌన్ పోలీసులు నాలుగు గంటల్లోనే ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదించారు. సోమవారం పొద్దంతా పంద్రాగస్టు విధుల్లో ఉన్నా.. రాత్రి 9.30గంటలకు ఫిర్యాదు వచ్చిన వెంటనే రంగంలోకి దిగారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా గాలించారు. కిడ్నాపర్ల వాహనానికి నంబర్ ప్లేట్ లేకున్నా.. విచారణ జరిపి అర్ధరాత్రి 1:30 గంటల్లోగా కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీరికలేకుండా పని చేసినా, పాప కిడ్నాప్ కేసును కేవలం నాలుగు గంటల్లోగా ఛేదించిన పోలీసులకు పలువురు సెల్యూట్ చేశారు.
తెలంగాణచౌక్, ఆగస్టు 16 : కరీంనగర్లో సోమవారం ఓ పాప కిడ్నాప్ అయ్యిందన్న వార్త కలకలం సృష్టించింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న కూతురు కనిపించక పోవడంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగు గంటల్లోనే కేసును ఛేదించారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం పోలీసు కమిషనర్ సత్యనారాయణ పోలీసులను అభినందించి, విలేకరుల సమావేశంలో కేసు పూర్తి వివరాలను వెల్లడించారు. కరీంనగర్లోని అశోక్నగర్కు చెందిన కుత్బొద్దీన్ మాంసం విక్రయిస్తూ జీవనం కొససాగిస్తున్నాడు. ఈ నెల 15న సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో అతని ఒకటిన్నరేళ్ల కూతురు నిమ్ర ఇంటి ఎదుట ఆడుకుంటున్నది. కొద్ది సేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాప కోసం వెతుకుతుండగా ఒక ఆటోలో ఇద్దరు సీటు ముందు పాపను కూర్చోబెట్టుకొని వెళ్లిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో వెంటనే కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏసీపీ తుల శ్రీనివాస్ ఆదేశాలతో సీఐలు నటేశ్, దామోదర్రెడ్డి బృందంతో హుటాహటిన నేర స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పాప ఆచూకీ కోసం వెతికారు. నేరం జగిరిన ప్రాంతం నుంచి నాఖా చౌరస్తా, సుభాష్నగర్, కరీంనగర్ బస్టేషన్, రాజీవ్చౌక్ ప్రాంతాల్లో ఆటో అడ్డాలను తనిఖీ చేశారు. పలువురు ఆటో డ్రైవర్లను విచారించారు. కిడ్నాపర్ ఆటో మంచిర్యాల చౌరస్తా సమీపంలోని ఒక దవాఖాన వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లినట్లు గమనించిన పోలీసులు ఆ దారిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటో ముందు జాతీయ జెండా, వెనుక చెట్టు స్టిక్కర్, డ్రైవర్ లేత గూలాబీ రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, ఆటోకు నంబర్ లేక పోవడంలో విచారణ జటిలంగా మారింది. కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ప్రతి సీసీ కెమెరాను పరిశీలించారు. ఇంటికి వెళ్లి దుకాణదారులను పిలిపించి వారి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా ఆటో సుభాష్నగర్ ప్రాంతానికి వచ్చినట్లు గమనించారు. అర్ధరాత్రి సుభాష్నగర్లో ప్రతి గల్లీని తనిఖీ చేస్తుండగా కాలనీలో రోడ్డు పక్కన ఓ ఇంటి ఎదుట సదరు ఆటోను గమనించారు. దీంతో ఆ ఇంట్లో వారిని విచారించగా.. ఆ ఆటో తమ ఇంట్లో కిరాయి ఉంటున్న సంతోష్ అనే వ్యక్తిదని చెప్పగా, అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ముందు తనకు ఏమీ తెలియదని సంతోష్ బుకాయించాడు. పోలీసులు మరింత లోతుగా విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. తాను పాపను కిడ్నాప్ చేసినట్లు, తన మిత్రుడు ఖాజీపూర్ గ్రామానికి చెందిన రాములు వద్ద దాచి ఉంచినట్లు, పిల్లలు లేని వారికి విక్రయించాలని అనుకున్నట్లు తెలిపాడు. వెంటనే రాములు ఇంటిని సోదా చేయగా పాప క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాములును అదుపులోకి తీసుకొని పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
కఠిన శిక్ష పడేలా చర్యలు : సీపీ
పసి పాపను కిడ్నాప్ చేసిన నిందితుల సంతోష్, రాములుకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. గతంలో పసి పాపలను కిడ్నాప్ చేసిన నేరస్తుల మీద నిఘా పెడుతామన్నారు. కిడ్నాపర్లపై పీడీ యాక్ట్ కేసు పెడుతామని హెచ్చరించారు.
పోలీసులకు అభినందన
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విశాంత్రి లేకుండా విధులు నిర్వర్తించిన పోలీసులు సాయంత్రం సమయంలో జరిగిన పాప కిడ్నాప్ విషయం తెలియగానే మళ్లీ నిందుతుల కోసం గాలించారని సీపీ తెలిపారు. అర్ధరాత్రి వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ శ్రమించి నాలుగు గంటల్లోనే కిడ్నాపర్ల నుంచి పాపను క్షేమంగా రక్షించిన పోలీసులను అభినందించారు. కేసును విచారించిన సీఐలు నటేశ్, దామెదర్రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, పాషాతోపాటు సిబ్బందికి అభినందనలు తెలిపారు.