కొత్తపల్లి, నవంబర్ 25: కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర జూడో సంఘం ఆధ్వర్యంలో మానే రు విద్యాసంస్థల సౌజన్యంతో కరీంనగర్లోని మానేరు జూడో అకాడమీలో ఈ నెల 29, 30 తేదీల్లో పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 19 జిల్లాల నుంచి 380 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం మంక మ్మ తోటలోని సాయి మానేరు స్కూల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీలకు కరీంనగర్ జిల్లా వేదికగా నిలువడం సంతోషంగా ఉన్నదన్నారు.
మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో గతంలో అనేక రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో మరోసారి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే అవకాశం దక్క డం గర్వకారణంగా ఉన్నదన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలతో పాటు చాంపియన్ షిప్ ట్రోపీలను అందించనున్నట్లు వెల్లడించారు. పోటీల విజయవంతానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు.
రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు 19 జిల్లాల నుంచి 380 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు, 50 మంది రెఫరీలు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు డిసెంబర్ 16 నుంచి 20 వరకు జారండ్ రాష్ట్రంలో ని రాంచీలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల కు పంపించనున్నట్లు తెలిపారు. జిల్లా డీవైఎస్వో కీర్తి రాజవీరు మాట్లాడుతూ క్రీడా హబ్ గా మారిన కరీంనగర్లో మరొ మారు రాష్ట్ర పోటీలకు వేదిక కావడం అభినందనీయమన్నారు. సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ అంతటి శంకరయ్య, జూడో సంఘం భాద్యులు ఎల్వీ రమణ, సిలివేరి మహేందర్ పాల్గొన్నారు.