ఎల్లారెడ్డిపేట, మార్చి 27: మార్పు అంటే గోసపెట్టుడు కాదని, ఆడబిడ్డలు, రైతులు ఏడ్పించుడు కాదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నడూ ఈ పరిస్థితిని చూడలేదని చెప్పారు. మార్పు అంటే మంచి జరగాలని, కానీ, చెడువైపు వెళ్తున్నదని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు బోరున విలపిస్తున్న పరిస్థితిని చూస్తున్నానని ఆవేదన చెందారు.
ఆర్బీఐ మంగళవారం ప్రకటించిన జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలించిందని, అందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ప్రశంసించారు. సీఎం రేవంత్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పుడు అప్పుల తెలంగాణ, తెలంగాణ దివాలా తీసిందని అనగలరా..? అని ప్రశ్నించారు. ఎల్లారెడ్డిపేటలో బుధవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నప్పటికీ గ్రామా ల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో లేని విధంగా కరెంట్, సాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని వాపోయారు.
మోటర్లు కాలిపోతుండడంతో వైండింగ్ షాపులు మళ్లీ తెరుచుకుంటున్నాయన్నారు. బావుల్లో పూడికలు తీసే క్రేన్లు ఎట్లుంటయో ఈతరం పిల్లలకు తెలియదని కానీ, ఇప్పుడు క్రేన్లను చూసే దుస్థితి వచ్చిందన్నారు. బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారని, బంగారం అమ్మి రుణాలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తానని, ఇంకా ఎవరైనా తీసుకోనివారుంటే రు ణం తీసుకోవాలని రేవంత్రెడ్డి చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామన్న మాట కూడా నెరవేరలేదని, ఉచిత బస్సు మినహా ఆరు గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ సరిగా అమలు కాలేదని దుయ్యబట్టారు.
500కే సిలిండర్ ఉచిత పథకంలా కాకుం డా ఉద్దెర పథకంలా మారిందని, 970 కట్టి సిలిండర్ బుక్ చేస్తే తర్వాత తాము చెల్లిస్తామని అనడం తెలంగాణ ఆడబిడ్డల వద్ద ఉద్దెర పెట్టినట్లు ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో లోపమే రైతులకు శాపంలా మారిందని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా చూస్తునే ఉన్నారని, కాపర్డ్యాం కట్టి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపి పంటలకు నీళ్లెందుకు ఇవ్వలేదని ప్ర శ్నించారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా పంటకు మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ ఇస్తున్నరా..? లేదా అనే విషయాన్ని ఇంకా చెప్పడం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూ రి రవీందర్రావు, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ వర్సకృష్ణహరి, ఎంపీటీసీ ఎన్గందుల అనసూయ, నాయకులు అందె సుభాష్, పిల్లి కిషన్ పాల్గొన్నారు.