చొప్పదండి, ఏప్రిల్ 17: ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాగానే మళ్లీ ఏదో ఉద్దరిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నదని, అసలు ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థే కరువయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రజ లు భావోద్వేగాల బుట్టలో పడితే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. పనిచేసిందెవరో ఆలోచించి ఓటేయాలని, అభివృద్ధికి చోటివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి చొప్పదండి జడ్పీస్కూల్ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేశారు.
ఈ సందర్భంగా వాకర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఆ తర్వాత చొప్పదండిలో విస్తృత ప్రచారం చేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇండ్లు, దుకాణాల్లో కరపత్రాలు పంచుతూ ఓటేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి పనులను సాధించానని గుర్తు చేశారు. కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్పించి రూ. వెయ్యికోట్లు మంజూరు చేయించానని చెప్పారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ వరకు రైల్వేలైన్ తీసుకువచ్చానన్నారు.
మూడు జాతీయ రహదారుల నిర్మాణం, రాజీవ్ రహదారి అభివృద్ధి కోసం అప్పటి కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీకి ప్రతిపాదనలు పంపామన్నారు. దురదృష్టవశాత్తు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఐదేండ్లు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయనకు ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై మాట్లాడే అవగాహనలేదని మండిపడ్డారు. ఆయన హయాంలో ప్రజలకు ఒరిగింది గుండు సున్నా అని విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా కనీసం ఒక్క కొత్త జిల్లాకైనా నవోదయ స్కూల్ తెచ్చారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశంలోని అనేక రాష్ర్టాలకు 150 మెడికల్ కాలేజీలు ఇచ్చారని, ఇందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.
ఇందుకు చొరవ చూపాల్సిన ఆ పార్టీ ఎంపీలు చోద్యంచూశారని విమర్శించారు. కానీ కేసీఆర్ 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఇచ్చారని గుర్తుచేశారన్నారు. కొండగట్టును టీటీడీ తరహాలో తీర్చిదిద్దే సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 330 ఎకరాలను ఎండోమెంట్ శాఖకు అప్పగించేందుకు కృషి చేశానని చెప్పారు. చొప్పదండిని మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేశామని, 33 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని గుర్తుచేశారు. ప్రభుత్వం మారగానే పనులు ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే నిలిచిపోయిన సెంట్రల్లైటింగ్ పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఒక్కసారి గెలిపిస్తేనే ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను పార్లమెంట్కు పంపిస్తే ప్రశ్నించే గొంతుకనవుతానని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడి నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఈ సాంబయ్య, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణ హరి, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, గడ్డం చుకారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కౌన్సిలర్ కొత్తూరు మహేశ్, మాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వడ్డి, నాయకులు మాచర్ల వినయ్, డాక్టర్ అమిత్, నలుమాచు రామకృష్ణ, గన్ను శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.