శంకరపట్నం, నవంబర్ 24: మండల కేంద్రంలో డిసెంబర్ ఒకటిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో గురువారం ఆయన మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కేశవపట్నంలో రెండు చోట్ల ఖబ్రస్థాన్ల నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వంకాయగూడెం శివారులోని ‘మాధవసాయి’ గార్డెన్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఎంపీ బండి సంజయ్ ఎగిరెగిరి దూకడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
హుజూరాబాద్, మనుగోడు ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనట్లేనని తేలిందన్నారు. అభివృద్ధి పనులకు గుర్తింపుగా గన్నేరువరం మండలానికి జాతీయ స్థాయి అవార్డు వచ్చిందన్నారు. ఎక్కడా లేని విధంగా గన్నేరువరం మండలంలో 17 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నట్లు ఉద్గాటించారు. నియోజకవర్గానికి 300 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి రోజుకో తరహా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. భూ సమస్యలపై సత్వర పరిష్కారం చూపుతూ విజయవంతంగా కొనసాగుతున్న ధరణి పోర్టల్పై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఎన్నిక ఏదైనా ఓటమి ఎరుగని పార్టీ టీఆర్ఎస్
మానకొండూర్ నియోజకవర్గంలో 52 వేల మంది కార్యకర్తల సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని గర్వంగా ఉద్గాటించారు. తెలంగాణలో ఎన్నిక ఏదైనా ఓటమి ఎరుగని పార్టీగా ప్రజల మన్ననలు చూరగొంటున్నదని పేర్కొన్నారు. ఇందుకు పాటుపడుతున్న ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో డిసెంబర్ ఒకటిన మండలంలోని పార్టీ శ్రేణులతో మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రతి కార్యకర్త తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని పేర్కొన్నారు.
ప్రతి గ్రామం నుంచి 200 మంది కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రవీందర్, అఖిల్లు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాజా పాష, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఉప సర్పంచ్ హనుమంతు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అలీమొద్దీన్, ముస్లిం మత పెద్దలు ఖాజా మొహినొద్దీన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సతీశ్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.