రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్గా కరీంనగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్రావు, విప్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఉమ్మడి జిల్లాకు మరో రెండు పదవులు దక్కడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు భానుప్రసాద్రావు, కౌశిక్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
– పెద్దపల్లి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్టౌన్
పెద్దపల్లి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్టౌన్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్గా టీ భానుప్రసాద్రావు, విప్గా పాడి కౌశిక్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు వీణవంకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. కౌశిక్రెడ్డి ప్రభుత్వ విప్గా నియామకమవడంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
భాను ప్రసాద్రావుకు కేబినెట్ హోదా
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన తానిపర్తి భాను ప్రసాదరావుకు కేబినెట్ హోదా దక్కింది. మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన, రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 మే 2న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014 జూన్ 6వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015 జూన్ 2వరకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. 2016 జవవరి 1న రెండోసారి ఎన్నికై, 2022 జనవరి 4వరకు కొనసాగారు. 2019 సెప్టెంబర్ 7 నుంచి శాసన మండలి ప్రభుత్వ విప్గా ఉన్నారు.
2022 జనవరి 6న మూడోసారి ఎన్నికైన ఆయన, తాజాగా చీఫ్ విప్గా నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి గత శాసనసభలో ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్కు చీఫ్ విప్ దక్కగా, ఈసారి భానుప్రసాద్రావు అవకాశం వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సమయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒడిశా రాష్ట్ర పరిశీలకుడిగా పనిచేశారు. రాజీవ్హ్రదారి హౌజ్కమిటీ చైర్మన్గా, మైనార్టీ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొనసాగారు. మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, లైబ్రరీస్ కమిటీల్లో కొనసాగారు.
ప్రభుత్వ విప్గా ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి
వీణవంక మండల కేంద్రానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ మండలి విప్గా నియమితులయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్లో చేరిన ఆయనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించగా, నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తున్నారు. తనకు విప్ పదవి ఇచ్చినందుకు కౌశిక్రెడ్డి ప్రగతి భవన్కు వెళ్లి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
కార్యకర్తకు దక్కిన గౌరవం
నాకు బీఆర్ఎస్ ఇచ్చిన సమున్నత గౌరవమే శాసన మండల చీఫ్ విప్ పదవి. కష్టపడి పని చేస్తూ, పార్టీ బలోపేతానికి పని చేసే నాయకులు, కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని చెప్పడానికి ఈ పదవే నిదర్శనం. నాకు ఈ ఆవకాశమిచ్చిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– శాసన మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్రావు
సమర్థవంతంగా నిర్వహిస్తా..
నాపై నమ్మకంతో ప్రభుత్వ విప్గా నియమించిన ముఖ్యమంత్రికి, సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు నా కృతజ్ఞతలు. నాకు ముఖ్యమంత్రి ఏ బాధ్యతను ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా. నాకు వెన్నుదన్నుగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకునే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటా.
– శాసనమండలి విప్ పాడి కౌశిక్రెడ్డి