మామిడి కొనుగోళ్లకు సర్వం సిద్ధమైంది. త్వరలోనే కోతలు మొదలు కానుండగా, ఆ వెంటే కొనేందుకు కరీంనగర్ మ్యాంగో మార్కెట్ రెడీ అవుతున్నది. ఇక్కడి నుంచి ఉత్తరాదికి ఎగుమతి కానుండగా, కరీంనగర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా ప్యాకింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్డు కేటాయించడంతోపాటు రైతులు, వ్యాపారులకు సకల సౌకర్యాలు కల్పించారు.
– ముకరంపుర, మార్చి 31
ముకరంపుర, మార్చి 31 : ఈ సారి మామిడి కాత బాగున్నది. మరికొద్ది రోజుల్లో కోత మొదలు కానుండగా, కొనుగోళ్లకు సర్వం సిద్ధమవుతున్నది. జిల్లాతోపాటు సమీప జిల్లాలకు చెందిన రైతులకు కరీంనగర్ మామిడి మార్కెట్ అన్ని విధాలా అనువుగా ఉండడం, ఎంతో విశాలంగా మూడెకరాల్లో విస్తరించి ఉండడంతో తమ ఫలసాయాన్ని ఇక్కడే విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు. గత అనుభవాల దృష్ట్యా ప్రతి దశలోనూ కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రైతుల వాహనాలు మార్కెట్ యార్డు గేట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి బయటకు వెళ్లే దాకా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
యార్డులోని నాలుగు షెడ్లలో వ్యాపారులు మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఏ సమస్య లేకుండా సత్వరమే స్పందించేలా సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. బిడ్డింగ్ పూర్తయిన వెంటనే వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి, పూర్తి వివరాలతో రైతులకు తక్పట్టీ, చెల్లింపులు చేసేలా పటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే తరుగు, క్యాష్ కటింగ్, కమిషన్ పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టేలా నిఘా ఉంచారు. అంతేకాకుండా మార్కెట్ బయట కొనుగోళ్లు చేస్తూ ఆదాయానికి గండికొట్టే వ్యాపారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో పర్యవేక్షించనున్నారు. కాయల ప్యాకింగ్లో నిషేధిత రసాయనాలు వినియోగిస్తే కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రత్యేకంగా షెడ్
కొనుగోలు చేసిన కాయలను గ్రేడింగ్ చేసి, ప్యాకింగ్ చేసుకోవడానికి వీలుగా వ్యాపారులకు యార్డులో 5మెట్రిక్ టన్నుల షెడ్డును అదనంగా కేటాయించారు. దీంతో వ్యాపారులకు గతంలో మాదిరిగా ఏ ఇబ్బంది ఉండదు. మన మామిడికి ఉత్తరాదిలోని విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో సీజన్ ప్రారంభమైన వెంటనే పలు రాష్ర్టాల నుంచి వ్యాపారులు కూలీలతో ఇక్కడి మార్కెట్కు చేరుకుంటారు. మార్కెట్ పూర్తయ్యేంత దాకా ఇక్కడే ఉండి వారి ప్రాంతాలకు మామిడి కాయలను ఎగుమతి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గ్రేడింగ్, ప్యాకింగ్కు ఇబ్బంది తలెత్తకుండా వివిధ రాష్ర్టాల నుంచి కూలీలతో ఎంత మంది వ్యాపారులు వచ్చినా ఎక్కడికక్కడే ప్యాకింగ్ చేసుకోవడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు.
నిరంతరం నిఘా
సీజన్లో మామిడి మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, వ్యాపారులు, కూలీలతో పాటు వాహనాల రాకపోకలు, లోడింగ్, అన్లోడింగ్తో బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో క్రయవిక్రయాలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టారు. మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి కదలికలను గుర్తించేలా అత్యంత స్పష్టత కలిగిన సీసీ కెమెరాలను అమర్చారు. ఇందుకోసం యార్డులో పూర్తి స్థాయిలో ఎల్ఈడీ విద్యుద్దీపాలను బిగించి, నిరంతర విద్యుత్ సరఫరాకు అంతా సిద్ధం చేశారు. అయితే సాంకేతికంగా ఇబ్బంది ఏర్పడితే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం జనరేటర్ను సైతం అందుబాటులో ఉంచారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహిస్తున్న పండ్ల మార్కెట్లో మామిడి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం. వేసవిలో రైతులు, వ్యాపారులతో పాటు ఇక్కడ పనిచేసే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాం. వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలి. రైతులను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టవద్దు. పారిశుధ్య సమస్య లేకుండా పండ్ల వ్యర్థాలను తొలగించేందుకు ట్రాక్టర్తోపాటు ఐదుగురు కూలీలను కేటాయించాం. ఈ సీజన్లో గ్రేడింగ్, ప్యాకింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్డును కేటాయించాం. అలాగే చల్లటి తాగునీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చాం. మూత్రశాలలు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాం.
– రెడ్డవేని మధు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (కరీంనగర్)