కరీంనగర్ రూరల్, నవంబర్ 20 : కూలీ బిడ్డ చిన్నతనంలోనే తనకు ఇష్టమైన రంగంలోకి అడుగుపెట్టింది. తల్లి మరణంతో దిగులు చెందకుండా రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించింది. కఠోర సాధన చేసి ఇండియన్ నేవీకి ఎంపికై తండ్రి కలను సాకారం చేసింది అఖిల విజయగాథపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
కరీంనగర్ మండలం నల్లంగుంటపల్లికి చెందిన అట్ల ఐలయ్య-లక్ష్మి దంపతుల పెద్ద కూతురు అఖిల చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. ఆమె తల్లి 11 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటినుంచి తండ్రి ప్లంబర్ పనులు చేస్తూ ఇద్దరు కొడుకులు, బిడ్డను చదివిస్తున్నాడు. అఖిల దుర్శేడ్ జడ్పీస్కూల్లో పదో తరగతి వరకు చదివింది. టెన్త్లో 10 జీపీఏ సాధించడంతో మెరిట్ ఆధారంగా కరీంనగర్ ఎస్సార్ జూనియర్ కళాశాలలో ఉచిత విద్యాభ్యాసానికి అవకాశం దొరికింది.
గతేడాది బైపీసీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ చదువుతున్నప్పుడే కళాశాలలో రామయ్య డిఫెన్స్ అకాడమీ నల్గొండ వారు కళాశాలలో నేవీపై డెమో క్లాసులు నిర్వహించారు. దీంతో అఖిల గత జూన్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్, ఏన్డీఏలో శిక్షణ కోసం అకాడమీలో చేరింది. నాలుగు నెలల శిక్షణ అనంతరం అక్టోబర్లో విశాఖపట్నంలో నేవీ ఎంట్రెన్స్ పరీక్ష రాసింది. ఇందులో ప్రతిభ చూసి అగ్నివీర్గా నేవీకి ఎంపికైంది. డిసెంబర్ 1న ఉద్యోగంలో చేరనున్నది. కాగా, బిడ్డ అఖిలకు చిన్నతనంలోనే దేశసేవ చేసే అవకా శం రావడంతో తండ్రి ఐలయ్య ఆనందంలో మునిగితేలుతున్నాడు. తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషంగా చెబుతున్నాడు. అలాగే అఖిలను కళాశాల అధ్యాపకులు,స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.