ఆయన మార్గం అనుసరణీయం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
ఘనంగా జయంత్యుత్సవాలు
కార్పొరేషన్, ఫిబ్రవరి 25: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ త్యాగానికి ప్రతీక అని, నేటి తరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సేవాలాల్ జీవిత చరిత్రను భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శుక్రవారం సప్తగిరికాలనీలోని సేవాలాల్ మందిరం నిర్మాణ స్థలంలో సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలను నిర్వహించారు. మంత్రి హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవాలాల్ మందిరం, బంజారాల భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ పత్రాన్ని బంజారా నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సేవాలాల్ జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంతు హింస వద్దని, హిందూ ధర్మం కోసం దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి అవసరం మేరకు మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నగర మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ, సేవాలాల్ మందిరం నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అంతకు ముందు సేవాలాల్ భవన నిర్మాణానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, సభాధ్యక్షుడు, ఎంపీటీసీ తిరుపతినాయక్, ఉత్సవ కమిటీ నాయకులు ఎల్ రూప్సింగ్, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, బంజారా ప్రతినిధులు భాసర్ నాయక్, తిరుపతి, రాజు నాయక్, రవి నాయక్, సంతోష్, శంకర్, దష్మిబాయి పాల్గొన్నారు.