రామడుగు, జూన్ 29 : దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును తెచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపి, ధనవంతుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రామడుగు మండలంలో కొత్తగా ఏర్పాటైన పందికుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దళితకాలనీలో బుధవారం లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయసాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిదర్శనంగా నిలుస్తున్నదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా వంద యూనిట్లు మంజూరయ్యాయని, మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలోని దళితులకు దళితబంధు సాయం అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఫర్టిలైజర్స్, మెడికల్ షాపులు, టైల్స్ దుకాణం, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, కార్లు, ఇతరత్రా దుకాణాలు పెట్టుకున్నారన్నారు.
దళితబంధును ప్రారంభించిన సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రూ. 10 లక్షలు వచ్చేదికాదు, సచ్చేదికాదని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. చొప్పదండి నియోజకవర్గానికి మొదటిదఫా వంద యూనిట్లు మంజూరు కాగా, మరో 1500 యూనిట్లు వస్తాయని చెప్పారు. జూలై పదో తేదీ వరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ఊరికి నాలుగు నుంచి ఐదు యూనిట్లను అందిస్తామని తెలిపారు. దళితబంధు నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటామన్నారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సురేందర్, పీఆర్ ఏఈ సచిన్, సర్పంచ్ మొగుల్ల ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సైండ్ల కరుణాకర్, మాదం రమేశ్, రాళ్ల లక్ష్మణ్, లంక మల్లేశం, ఆరపెల్లి ప్రశాంత్, చాడ ప్రభాకర్రెడ్డి, చిరుత అంజయ్య, పెంటి శంకర్, గడ్డం మోహన్రావు, ప్రశాంత్, చంటి శ్రీనివాస్, నాగుల రాజశేఖర్గౌడ్, మామిడి తిరుపతి, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.
భరోసా ఇచ్చిండు..
గతంలో నేను కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది. నాకు చేయూతనందిస్తూ రాష్ట్ర సర్కారు పది లక్షల సాయం చేసింది. నాతో పాటు అన్నకు కూడా యూనిటు ఇచ్చిన్రు. ఇద్దరం కలిసి ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకున్నం. మాకు చుట్టూ నాలుగైదు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మేము మంచిగ బతుకుతం అనే నమ్ముకం కల్పించిండ్రు. మాకు సాయం జేసిన సీఎం కేసీఆర్ సారు, మా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సార్కు రుణపడి ఉంటం.
– రాళ్ల లక్ష్మణ్, లబ్ధిదారుడు, పందికుంటపల్లి
సాయం జేసినోళ్లు సల్లగుండాలే..
నేను ఒంటరి మహిళను, నాకు నా అనేళ్లు ఎవరూ లేరు. పొద్దంత కైకిలివొయ్యి అచ్చిన పైసలతోని బతుకెళ్లదియ్యాలె. నాకు దిక్కు లేదని బాధపడ్తన్నప్పుడు సీఎం కేసీఆర్ సారు దేవునోలె మాకు సాయం జేసి దళితబంధు యూనిట్ ఇచ్చిండు. నేను టెంట్హౌస్ పెట్టుకున్న. ఇప్పుడు నా బతుకు దెరువు చూపిండు. ఈ పది లక్షలతోని కష్టపడి ఇంకింత పైసలు పోగెత్త. మా వూళ్లె టెంట్హౌస్ లేదు. మంచిగ కష్టపడితే పాయిద ఉంటదనిపిస్తంది. నాకు బతుకు జూపిచ్చి సాయంజేసిన సర్కారోళ్లకు దండాలు వెడ్తన్న. సాయం జేసినోళ్లు సల్లగుండాలె – బండ దివ్య, లబ్ధిదారు, పందికుంటపల్లి