మల్యాల, జూన్ 28 : కొండగట్టు ఘాట్రోడ్డు పునఃప్రారంభం కానుంది. వాహనాల రాకపోకలకు అనుమతి లభించింది. ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లే ఘాట్రోడ్ గుండా పలు ఆంక్షలతో లైట్మోటార్ వాహనాల రాకపోకలకు అనుమతిస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 సెప్టెంబర్ 11న కొండగట్టు ఘాట్రోడ్ గుండా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోగా 65 మంది మృతి చెందిన సంఘటన తర్వాత ఘాట్రోడ్ గుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అప్పటి రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ శరత్, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలసి ఘాట్రోడ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఘాట్రోడ్డును ప్రమాదరహితంగా మార్చేందుకు సైడ్వాల్లు, పటిష్ఠంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని సూచించడంతో రూ. కోటికి పైగా వెచ్చించి రోడ్డును సుందరీకరించారు.
ఆ తర్వాత ఘాట్రోడ్డు గుండా వాహనాలను కేవలం కొండపైకి మాత్రమే అనుమతించారు. ఘాట్ రోడ్డు ద్వారా కిందికి వాహనాల రాకపోకలను అనుమతించలేదు. కానీ గుట్ట కింద ఉండే చిరువ్యాపారుల జీవనోపాధిపై పరోక్షంగా ప్రభావం పడడంతో పాటు స్థానిక నాయకులపై ఘాట్రోడ్ను ప్రారంభించాలని చిరువ్యాపారులు ఒత్తిడి పెంచారు. దీంతో స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, మల్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్ విషయాన్ని దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాహనాల రాకపోకలకు ఉత్తర్వులను జారీ చేయించేందుకు కృషి చేశారు.
ఈ నేపథ్యంలోనే రవాణా, రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరాజు పలు ఆంక్షలతో కూడిన పలు ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఘాట్రోడ్ గుండా కార్లు, ఆటోలు, జీపులు, ద్విచక్రవాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నామని, భారీ వాహనాలైన బస్సులు, లారీలు, మినీబస్సులు, ట్రాక్టర్లు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్లు ఘాట్రోడ్ గుండా ప్రయాణించడానికి వీలు లేదని వెల్లడించారు. కొండపైకి, కిందకు ఘాట్రోడ్ గుండా తిరిగే వాహనాలు గంటకు 20 కిలోమీటర్ల గరిష్ఠ వేగానికి మించి ప్రయాణం చేయకూడదని, పరిమితికి మించి ప్రయాణికులు ఉండకూడదని పేర్కొన్నారు. ప్రతి రోజు పోలీస్, రవాణా శాఖ సిబ్బంది పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి మాట్లాడారు. ఘాట్రోడ్డు గుండా వాహనాల రాకపోకలను అనుమతించేందుకు ప్రత్యేక చొరవ చూపి కృషిచేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రవిశంకర్, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.