కార్పొరేషన్, జూన్ 28: అసత్యాలు, అవాస్తవాలతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నదని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని నగర మేయర్ వై.సునీల్రావు విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే కుట్రతో రాష్ట్రంలో 15 లక్షల రేషన్కార్డులు తొలగించినట్లు బండి సంజయ్ లేఖ విడుదల చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 53,88,143 రేషన్కార్డులను మంజూరు చేసిందని, వీటిలో 1,91,70,012 మంది లబ్ధిదారులున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 90,39,183 రేషన్కార్డులను పేదలకు అందించిందని, వీటిలో 2,86,46,341 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇది తెలుసుకునే సోయి లేక అడ్డదిడ్డంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 66 లక్షల మందికి రైతుబంధు కింద రూ.7,500 కోట్లు ఇస్తున్నామని, ఇప్పటివరకు రూ.58 వేల కోట్లను మంజూరు చేశామన్నారు.
కొత్తగా 3.50 లక్షల మంది రైతులను ఈ పథకంలోకి తెచ్చామన్నారు. కరీంనగర్ జిల్లాలోనే 1,77,451 మంది రైతులకు రూ.176 కోట్లను రైతుబంధు కింద అందిస్తున్నామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం 70,450 మందికి రూ.14 కోట్లను మాత్రమే ఇస్తున్నదని, ఇప్పటి వరకు రూ.7,689 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. పైగా, 2024 వరకు కొత్త వారికి ఇవ్వమని నిబంధనలు పెట్టిందని విమర్శించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం, ఎరువుల ధరలు పెంచడం, పండిన పంటను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆయన వెంట కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, వాల రమణారావు, జంగిలి ఐలేందర్యాదవ్, తోట రాములు, గంట కళ్యాణి, పుట్ట నరేందర్, గందె మాధవి, భూమాగౌడ్, సాగర్, నాయకులు కాశెట్టి శ్రీనివాస్, అర్ష మల్లేశం తదితరులు పాల్గొన్నారు.